Kiren Rijiju | కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా.. వారంత దేశద్రోహులు, జాతి వ్యతిరేకులు. ప్రస్తుతం బీజేపీ పాలనలో ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు లేకుండా పోయింది. పలువురు రాజకీయ నాయకులు, హక్కుల, సామాజిక కార్యకర్తలు తదితరులపై దేశద్రోహులు అంటూ ముద్ర వేస్తున్న బీజేపీ, ఆఖరుకు న్యాయమూర్తులను కూడా వదలడం లేదు. వారు కూడా దేశ వ్యతిరేకులేనని, ‘యాంటి ఇండియా గ్యాంగ్’ అంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి, బీజేపీ నేత కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ, మార్చి 18: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై వ్యాఖ్యలు చేసిన సీజేఐ జస్టిస్ చంద్రచూడ్పై కొన్ని అల్లరి మూకలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశాయి. ఇది అధికార బీజేపీ కార్యకర్తల పనేనని పేర్కొంటూ పలువురు విపక్ష పార్టీల ఎంపీలు రాష్ట్రపతి ముర్ముకు లేఖ రాశారు. ఆ ఘటన మరువక ముందే సాక్షాత్తు కేంద్ర న్యాయశాఖ మంత్రి, బీజేపీ నేత కిరణ్ రిజిజు న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాజీ న్యాయమూర్తులను యాంటి ఇండియా గ్యాంగ్ (భారత వ్యతిరేక ముఠా)గా పోల్చారు. యాంటి ఇండియా గ్యాంగ్లో భాగమైన కొంత మంది రిటైర్డ్ జడ్జీలు న్యాయవ్యవస్థను ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించేలా ఒత్తిడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. శనివారం ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న మంత్రి రిజిజు ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఇటీవల న్యాయమూర్తుల సెమినార్ జరిగింది. అక్కడ కార్యనిర్వాహక వ్యవస్థ(ప్రభుత్వం) న్యాయవ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపైనే చర్చించారు. సామాజిక కార్యకర్తలుగా చెప్పుకొనే యాంటి ఇండియా గ్యాంగ్లో భాగమైన కొంతమంది జడ్జిలు న్యాయవ్యవస్థను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పాత్ర పోషించేలా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని తెలిపారు. కొంతమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పదేపదే కోర్టుకు వెళ్తుంటారని పేర్కొన్నారు.
జడ్జీల నియామకాలు న్యాయవ్యవస్థ పనికాదని, అది పూర్తిగా పరిపాలనాపరమైనదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం పేర్లు పంపితే.. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత అని, లేకుంటే ప్రభుత్వం పోస్టుమాస్టర్గా కూర్చోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకాల విషయంలో సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలపై కూడా రిజిజు విమర్శలు చేశారు. కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలతో సహా వివిధ సంస్థల మధ్య రాజ్యాంగబద్ధమైన ‘లక్ష్మణ రేఖ’ ఉంటుందని అన్నారు. పరిపాలనా నియామకాల విషయంలో కూడా న్యాయమూర్తులు భాగమైతే, న్యాయవ్యవస్థ పని ఎవరు చేస్తారు? అంటూ ప్రశ్నించారు. ఎలక్షన్ కమిషనర్ల నియామకాల అంశాన్ని రాజ్యాంగం నిర్దేశించిందని, అందుకు అనుగుణంగా నియామకాలు జరుగుతున్నాయని తెలిపారు. ‘ఎన్నికల కమిషనర్ల నియామకాల గురించి రాజ్యాంగంలో నిర్దేశించారు. పార్లమెంట్ ఒక చట్టం చేయాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా నియామకాలు జరుగుతాయి. అయితే ఎలక్షన్ కమిషనర్ల నియామకాల కోసం పార్లమెంట్ ఎలాంటి చట్టం చేయలేదు. ఆ విషయంలో శూన్యత ఉన్నదని ఒప్పుకొంటున్నా’ అని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం బీజేపీ పాలనలో దేశంలో న్యాయవ్యవస్థ హైజాక్కు గురవుతున్నది, ప్రజాస్వామ్యం దాడికి గురవుతున్నదని వస్తున్న తీవ్ర విమర్శలపై రిజిజు సూటి సమాధానం చెప్పకుండా, విమర్శకులపైనే ఆరోపణలు గుప్పించారు. భారత న్యాయవ్యవస్థ హైజాగ్కు గురవుతున్నదని, ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని రాహుల్ గాంధీ లేదా ఏ ఇతరులు చెప్పినా.. అది దేశ న్యాయవ్యవస్థను అణచివేసే ప్రయత్నంలో భాగమేనని రిజిజు వెల్లడించారు. అయితే, కొలీజియం, న్యాయవ్యవస్థ, జడ్జిలపై రిజిజు చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి.
పనిలో పనిగా సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థపై కూడా రిజిజు మరోసారి విమర్శలు చేశారు. జడ్జీలుగా నియామకానికి సంబంధించి పేర్లను కొలీజియం తిరిగి పంపడంపై, ఆయా పేర్లపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరాలకు ఉన్న కారణాలను బహిరంగ పరచాలన్న కొలీజియం నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించారు. ‘నా వద్ద ఇప్పుడు కొందరి పేర్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరిపై సహచర జడ్జీలు, ప్రజలు, బార్ అసోసియేషన్ నుంచి చాలా ఫిర్యాదులు ఉన్నాయి. అయితే ఆ పేర్లను బయటపెట్టదలచుకోలేదు. ఒక న్యాయమూర్తి, మరొక న్యాయమూర్తిపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే.. వాటిని నేను బహిరంగపరచకూడదు’ అని పేర్కొన్నారు.