న్యూఢిల్లీ, జనవరి 23: న్యాయమూర్తుల నియామక విధానంపై తరచూ విమర్శలు గుప్పిస్తున్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు మరోసారి న్యాయవ్యవస్థను లక్ష్యంగా చేసుకున్నారు. న్యాయమూర్తులను ప్రజలు ఎన్నుకోరు కాబట్టి, వారిపై ఎలాంటి ప్రజా సమీక్ష ఉండదని అన్నారు. అయితే ప్రజలు వారిని గమనిస్తున్నారని, వారి పనితీరును, వారిచ్చే తీర్పులను పరిశీలిస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు మధ్య ఇటీవల తీవ్ర వివాదం నడుస్తున్న నేపథ్యంలో రిజిజు తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
సోమవారం ఢిల్లీలోని టిస్ హజారీ కోర్టు కాంప్లెక్స్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రిజిజు మాట్లాడారు. ‘సోషల్ మీడియా కారణంగా నేడు సామాన్య ప్రజలు కూడా ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారు. నిలదీస్తున్నారు. దీన్ని మేం ఎదుర్కొంటున్నాం. ఒకవేళ ప్రజలు మళ్లీ మమ్మల్ని ఎన్నుకుంటే.. తిరిగి అధికారంలోకి వస్తాం. లేదంటే ప్రతిపక్షంలో కూర్చొంటాం’ అని పేర్కొన్నారు. అయితే ఒక వ్యక్తి జడ్జిగా నియమితులైన తర్వాత, అతడు ఎన్నికలు ఎదుర్కోవాల్సిన పనిలేదని, న్యాయమూర్తులపై ప్రజా సమీక్ష ఉండదని అన్నారు. ‘ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోరు కాబట్టి. వారు మిమ్మల్ని మార్చలేరు. కానీ మీరు ఏ విధంగా తీర్పులు ఇస్తున్నారనేది గమనిస్తున్నారు. దానిపై ఓ అభిప్రాయానికి వస్తున్నారు. నేటి సోషల్ మీడియా యుగంలో ఏ విషయాన్నీ దాచలేం’ అని పేర్కొన్నారు.
మా మధ్య మహాభారతమేమీ నడవట్లేదు
ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మధ్య అభిప్రాయ భేదాలు ఉండొచ్చని, అంతమాత్రాన రెండూ ఒకదానిపై ఒకటి దాడి చేసుకున్నట్టు కాదని రిజిజు అన్నారు. కొంతమంది పేర్కొంటున్నట్టుగా తమ మధ్య మహాభారతమేమీ నడవట్లేదని అన్నారు. కేంద్రం, న్యాయవ్యవస్థ మధ్య ఎలాంటి సమస్యలు లేవని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో చర్చ అనేది లేనప్పుడు అది ఎలాంటి ప్రజాస్వామ్యం అవుతుందని ప్రశ్నించారు. సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులపై దూషణలకు దిగేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీజేఐ తనను కోరినట్టు రిజిజు చెప్పారు. తమకున్న పరిమితుల కారణంగా న్యాయమూర్తులు బహిరంగ వేదికల్లో వాదనలకు దిగలేరని పేర్కొన్నారు. ఈ రోజుల్లో న్యాయమూర్తులు జాగ్రత్తగా ఉండాలని, ఏదైనా తీర్పు సమాజంలో తీవ్ర ప్రతిఘటనకు దారితీస్తే, జడ్జిలు కూడా ఆ ప్రభావాన్ని ఎదుర్కొనాల్సి ఉంటుందని చెప్పారు.