Delhi Police : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. పదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి, అనంతరం హత్య చేశాడు ఒక క్యాబ్ డ్రైవర్. ఆ తర్వాత ఆ బాలికను అడవుల్లో పారేశాడు. ఈ ఘటన దక్షిణ ఢిల్లీ పరిధిలోని సీడీఆర్ చౌక్ ఏరియా సమీపంలో సోమవారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ, సీడీఆర్ చౌక్ సమీపంలో పదేళ్ల బాలిక కుటుంబంతో కలిసి ఫుట్పాత్పై నిద్రిస్తుండగా సోమవారం ఉదయం ఐదు గంటల సమయంలో బబ్లూ అనే క్యాబ్ డ్రైవర్ ఆ బాలికను ఎత్తుకెళ్లాడు.
తన కార్లో బలవంతంగా ఎక్కించుకుని గుర్గావ్ (గురుగ్రామ్) ప్రాంతంలోకి ఎక్కించుకెళ్లాడు. అక్కడ బాలికపై అత్యాచారం చేశాడు. అనంతరం ఆ బాలిక వల్ల ఎక్కడ నిజం బయటపడుతుందో అని భావించిన బబ్లూ ఆ బాలికను చంపేశాడు. తర్వాత ఆధారాలు దొరకకుండా బాలిక మృతదేహాన్ని గుర్గావ్-ఫరిదాబాద్ రోడ్డు మార్గంలో, మెహ్రౌలి ప్రాంతంలోని దట్టమైన అడవుల్లో వదిలేశాడు. ఈ ఘటనపై ఉదయం పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం ఆరు గంటల్లోనే నిందితుడు బబ్లూను అరెస్టు చేశారు. అలాగే, బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బబ్లూ తానే నేరం చేసినట్లు అంగీకరించాడు.
బాలిక ఆచూకీ కోసం అనేక టీంలు ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. వందలాది సీసీటీవీ కెమెరాల్ని పరిశీలించామన్నారు. నిందితుడిపై పోక్సో సహా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని పోలీసులు తెలిపారు.