న్యూఢిల్లీ : చత్తీస్ఘఢ్, మధ్యప్రదేశ్, రాజస్ధాన్ ఎన్నికల్లో (Assembly Elections Results) పార్టీకి లభించిన ఫలితాలు నిరుత్సాహపరిచాయని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు. తెలంగాణలో తమ పార్టీకి పట్టం కట్టిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీకి ఎదురైన తాత్కాలిక ఎదురుదెబ్బలను చక్కదిద్దుకుని రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతామని ఖర్గే పేర్కొన్నారు.
రాజస్ధాన్, ఛత్తీస్ఘఢ్, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ను కాషాయ పార్టీ మట్టికరిపించింది. మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ను దాటిన బీజేపీ స్పష్టమైన ఆధిక్యత దిశగా దూసుకుపోతోంది. ఈ రాష్ట్రాల్లో తమ పార్టీకి ఓటు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని, రాజస్ధాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘఢ్లో పార్టీ సాధించిన ఫలితాలు కచ్చితంగా నిరుత్సాహపరిచాయని ఓటమిని అంగీకరిస్తూ ఖర్గే పేర్కొన్నారు.
ఈ మూడు రాష్ట్రాల్లో తాము శక్తివంచన లేకుండా పనిచేసి తిరిగి సత్తా చాటుతామని ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇక కీలకమైన మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమితో విపక్ష ఇండియా కూటమి తదుపరి ప్రస్ధానం ఎలా సాగుతుందనేది ఉత్కంఠ రేపుతోంది.
Read More :
Pocharam Srinivas Reddy | పోచారం శ్రీనివాస్ రెడ్డి సరికొత్త చరిత్ర.. ఆ సంప్రదాయానికి స్వస్తి