Khalistan | ఢిల్లీలోని ప్రగతి మైదానాన్ని స్వాధీనం చేసుకుంటామని, అక్కడ త్రివర్ణ పతాకానికి బదులుగా ఖలిస్థానీ జెండా ఎగురవేస్తామని ఖలిస్థాన్ (Khalistan) మద్దతుదారులు హెచ్చరించారు. ఖలిస్థాన్ వేర్పాటువాద నాయకుడు అమృత్పాల్ సింగ్ (Amritpal Singh), అతని అనుచరులకోసం పంజాబ్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్న నేపథ్యంలో ఈ హెచ్చరికలు జారీచేశారు. ముంబై నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చిన ఓ వ్యక్తి సెల్ఫోన్కు ముందుగానే రికార్డు చేసిన వాయిస్ మెసేజ్ రావడంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై ఢిల్లీ స్పెషల్ సెల్ విభాగం దార్యాప్తు ప్రారంభించింది.
ఖలిస్థాన్ వేర్పాటువాద నాయకుడు, వారిస్ పంజాబ్ దే అధ్యక్షుడు అమృత్పాల్ సింగ్ గత వారం రోజులుగా తప్పించుకు తిరుగుతున్నాడు. అతడిని పట్టుకునేందుకు మూడు రాష్ట్రాల పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. పంజాబ్లో పోలీసుల కండ్లు కప్పి గత శనివారం పరారైన అమృత్పాల్ సింగ్ ఈ నెల 20న జాకెట్, ట్రౌజర్తో పాటు నల్ల కండ్లద్దాలు ధరించి అమృత్సర్లోని ఒక వీధిలో నడుస్తున్న దృశ్యం సీసీ టీవీ కెమెరాలలో రికార్డయింది. సంప్రదాయ దుస్తులు ధరించే పాల్.. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో వేషధారణను మార్చుకున్నట్టు గుర్తించారు. హర్యానాలోని కురుక్షేత్రలో ఒక మహిళ వద్ద ఆశ్రయం పొందిన తర్వాత, అక్కడి నుంచి గొడుగులో తన ముఖం కన్పించకుండా ఒక వీధిలో వెళ్తుండటాన్ని పోలీసులు సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. అయితే ఇప్పుడు అమృత్పాల్ దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు.
శుక్రవారం అతడు ఢిల్లీకి బయలుదేరినట్టు గుర్తించిన పంజాబ్, ఢిల్లీ పోలీసులు శనివారం కశ్మీర్ గేట్లోని అంతర్రాష్ట్ర బస్ టెర్మినల్కు చేరుకుని అక్కడి సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. ఈ కేసుకు సంబంధించి జమ్ముకశ్మీర్ పోలీసులు శనివారం ఓ జంటను అరెస్ట్ చేశారు. అమృత్పాల్కు ముఖ్య అనుచరుడైన పాపల్ప్రీత్ సింగ్తో సంబంధాలు కలిగి ఉన్నారన్న అనుమానంతో జమ్ములోని ఆర్ఎస్పురాకు చెందిన అమ్రిక్ సింగ్, అతని భార్య పరమ్జిత్ కౌర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుని వారిని పంజాబ్ పోలీసులకు అప్పగించారు.