Lok Sabha Elections | తిరువనంతపురం, ఏప్రిల్ 3: నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ రెండుసార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ దక్షిణాదిన మాత్రం ఆ పార్టీ విస్తరించలేకపోయింది. కర్ణాటక మినహా మిగతా దక్షిణాది రాష్ర్టాల రాజకీయాల్లో బీజేపీ పాత్ర పరిమితంగానే ఉన్నది. ఈ లోక్సభ ఎన్నికల్లో అయినా దక్షిణాదిన అన్ని రాష్ర్టాల్లో తామున్నామని నిరూపించుకునే దిశగా కమలం పార్టీ పావులు కదుపుతున్నది. ఇందులో భాగంగా ‘దేవభూమి’ కేరళపై ఆ పార్టీ చాలానే ఆశలు పెట్టుకున్నది. ఈ రాష్ట్రంలో ఇప్పటివరకూ ఒక్క లోక్సభ సీటునూ గెలవని బీజేపీ.. ఈసారి కనీసం ఐదు స్థానాల్లోనైనా నెగ్గాలని పట్టుదలగా ఉన్నది. మరోవైపు సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూడా కేరళలో మెజారిటీ స్థానాలను దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.
కేరళలో బీజేపీకి ఎన్నడూ ఆశించిన ఫలితాలు రాలేదు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం 15.64 శాతం ఓట్లు సాధించి మూడోస్థానానికి పరిమితమైంది. ఒక్క తిరువనంతపురంలో రెండోస్థానంలో నిలవడం మినహా మిగతా అన్ని స్థానాల్లో మూడో స్థానానికే పరిమితమైంది. ఇక, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో ఆశలు పెట్టుకొని బరిలో నిలిచి శక్తియుక్తులన్నీ ఒడ్డినా కూడా బీజేపీకి చేదు ఫలితాలే మిగిలాయి. పైగా 2019 లోక్సభ ఎన్నికలతో పోల్చితే ఆ పార్టీ ఓట్లు 2.60 శాతం తగ్గిపోయి 12.36 శాతం ఓట్లకు పరిమితమైంది. 2016 ఎన్నికల్లో గెలిచిన ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా కోల్పోయింది. ఈ లోక్సభ ఎన్నికల్లో పార్టీ గ్రాఫ్ను పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది. ఆ పార్టీ ఇంఛార్జిగా ఉన్న ప్రకాశ్ జవదేకర్ ఆరు నెలలుగా కేరళలోనే ఉండి పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
కేరళలో ముస్లిం, క్రైస్తవ ఓట్లు దాదాపుగా 46 శాతం వరకు ఉంటాయి. ఈ ఓట్లు తమకు వ్యతిరేకంగా ఉండటమే మైనస్గా మారిందని భావిస్తున్న బీజేపీ ఈసారి క్రైస్తవ ఓట్లపై కన్నేసింది. క్రైస్తవుడైన కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోని కుమారుడు అనిల్ ఆంటోనిని పార్టీలో చేర్చుకున్నది. ప్రముఖ క్రైస్తవ నేతగా ఉన్న పీసీ జార్జ్ నేతృత్వంలోని కేరళ జనపక్షం(సెక్యులర్) పార్టీని బీజేపీలో విలీనం చేసుకున్నది. గత ఏడాది ప్రధాని మోదీ కేరళకు వెళ్లినప్పుడు ప్రత్యేకంగా క్రైస్తవ పెద్దలతో సమావేశమయ్యారు. అయితే, క్రైస్తవుల ఓట్లను ఆకర్షించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు సీఏఏ, మణిపూర్ హింస గండి కొడుతున్నాయి. ఇటీవల గుడ్ఫ్రైడే సందర్భంగా పలువురు క్రైస్తవ బిషప్లు ఈ రెండు అంశాలను లేవనెత్తడం బీజేపీకి ఇబ్బందికరంగా మారింది.
కేరళలో ఆరెస్సెస్ బలంగా ఉన్నప్పటికీ బీజేపీ మాత్రం రాజకీయంగా ఎదగలేదు. ఆరెస్సెస్ కూడా కేరళలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ కంటే ఎక్కువ శాఖలు ఉన్నాయని, ఈ చిన్న రాష్ట్రంలో దాదాపు 5,142 ఆరెస్సెస్ శాఖలు పని చేస్తున్నాయని చెప్తారు. అయినప్పటికీ రాజకీయంగా మాత్రం ఇది బీజేపీకి కలిసి రావడం లేదు. కేరళలో హిందువుల ఓట్లు దాదాపు 54 శాతం ఉన్నప్పటికీ వారిలో మెజారిటీ కాంగ్రెస్, కమ్యూనిస్టుల వైపే ఉంటూ వస్తున్నారు. దీంతో ఈసారి హిందూ ఓటుబ్యాంకును పెంచుకునేందుకు కూడా బీజేపీ ప్రయత్నిస్తున్నది. కేరళలో హిందువుల్లో దాదాపుగా 25 శాతం వరకు ఏజవ సామాజికవర్గం వారు ఉంటారు. వీరు సంప్రదాయంగా కమ్యూనిస్టు పార్టీల వైపు ఉన్నారు. వీరిని తమవైపు తిప్పుకునేందుకు గానూ.. ఈ వర్గానికి చెందిన శ్రీనారాయణ ధర్మ పరిపాలన సంస్థ నేతృత్వంలో నడిచే భారత్ ధర్మ జనసేన(బీడీజేఎస్)తో బీజేపీ పొత్తు కుదుర్చుకున్నది. అయితే, బీడీజేఎస్ ప్రభావం కూడా గత ఏ ఎన్నికల్లోనూ అంతగా కనిపించలేదు.
గత కొన్ని దశాబ్దాలుగా కేరళలో కేవలం సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి మధ్యే ఎన్నికల పోరు జరుగుతున్నది. ఈ రెండు పార్టీలూ జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ కేరళలో మాత్రం పరస్పరం తలపడుతున్నాయి. గత లోక్సభ ఎన్నికల్లోనూ ఈ కూటముల మధ్య ద్విముఖ పోరు జరగగా యూడీఎఫ్ 19 సీట్లు గెలుచుకుంది. ఈసారి కాంగ్రెస్ ఎక్కువగా ఆశలు పెట్టుకున్న అతి కొన్ని రాష్ర్టాల్లో కేరళ ఒకటి. ఈసారి కూడా కేరళలో ద్విముఖ పోటీనే ఉంటుందని కాంగ్రెస్, సీపీఎం భావిస్తున్నాయి. బీజేపీ ప్రభావం కేవలం కొన్ని స్థానాల్లోనే నామమాత్రంగా ఉంటుందని కేరళ అసెంబ్లీ ప్రతిపక్ష నేత సతీశన్ అంటున్నారు.
కేరళలో బీజేపీ ప్రధానంగా పాలక్కడ్, కాసర్గోడ్, త్రిస్సూర్, పతనంతిట్ట, తిరువనంతపురం, అత్తింగల్ స్థానాలపై కన్నేసింది. త్రిస్సూర్ నుంచి ప్రముఖ నటుడు సురేశ్ గోపిని, అత్తింగల్ నుంచి కేంద్రమంత్రి వీ మురళీధరన్ను, తిరువనంతపురం నుంచి మరో కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ను, పతనంతిట్ట నుంచి అనిల్ ఆంటోనీని బరిలోకి దింపింది. వీరి ఇమేజ్ కూడా కలిసొస్తుందని, కచ్చితంగా ఐదు స్థానాలను గెలుచుకుంటామని బీజేపీ చెప్తున్నది.