తిరువనంతపురం : కేరళలో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ సోమవారం ప్రకటించారు. కన్నూరుకు చెందిన ఒకరికి వైరస్ పాజిటివ్గా తేలినట్లు పేర్కొన్నారు. ఈ నెల 12న దేశంలో తొలి మంకీపాక్స్ కేరళలోనే నమోదైన విషయం తెలిసిందే. కొల్లాంకు చెందిన వ్యక్తి ఇటీవల షార్జా నుంచి వచ్చిన వ్యక్తి వైరస్ పాజిటివ్గా తేలింది. ఆ తర్వాత అతన్ని వెంటనే ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు. మంకీపాక్స్ వ్యాప్తి చెందకుండా కేరళ ప్రభుత్వం నిఘాను పెంచింది.
ఐదు జిల్లాలకు ప్రత్యేకంగా హెచ్చరికలు జారీ చేసింది. షార్జా-తిరువనంతపరం ఇండిగో విమానంలో వచ్చిన మంకీపాక్స్ పాజిటివ్ వ్యక్తి ప్రయాణించాడు. అతనితో పాటు తిరువనంతపురం, కొల్లాం, పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయానికి చెందిన ప్రయాణికులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఐదు జిల్లాలకు ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసినట్లు ఉన్నతస్థాయి సమావేశం అనంతరం మంత్రి వీణాజార్జ్ తెలిపారు. చికున్ గున్యా, ఇతర లక్షణాలున్న వారికి మంకీపాక్స్ సోకకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. వైరస్ ఇంకా ఎవరికైనా సోకిందా? అనే విషయం తెలుసుకునేందుకు నమూనాలను పరిశీలించనున్నట్లు చెప్పారు. ఎయిర్పోర్ట్లో పరీక్షలను ముమ్మరం చేస్తామని, ఈ మేరకు ఎయిర్పోర్ట్ అధికారులతో ఆరోగ్యశాఖ చర్చలు జరుపుతుందన్నారు.
ఎవరైనా లక్షణాలు కనిపిస్తే వారిని ఐసోలేట్ చేసి, ఆసుపత్రులకు తరలించేందుకు ప్రత్యేకంగా అంబులెన్స్ ఏర్పాటు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. మంకీపాక్స్ నివారణకు సమగ్రంగా శిక్షణ ఇస్తున్నామని, ఇప్పటి వరకు 1200 మంది ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇచ్చినట్లు వివరించారు. ఇదిలా ఉండగా.. ఇంతకు ముందు వైరస్ సోకిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అతని నుంచి ఎవరికీ వైరస్ సోకినట్లు నిర్ధారణ కాలేదన్నారు. ఆరోగ్యశాఖ సదరు వ్యక్తి కాంటాక్టులతో నిరంతరం సంప్రదిస్తున్నట్లు చెప్పారు. మానసిక, ఆరోగ్య పరిస్థితిపై ఫోన్లో ఆరా తీస్తున్నట్లు మంత్రి వివరించారు.