తిరువనంతపురం: కేరళలో కరోనా మహమ్మారి ( Covid in Kerala ) ఉధృతి కొనసాగుతూనే ఉన్నది. ఇవాళ కూడా అక్కడ కొత్తగా 19,325 మందికి పాజిటివ్ వచ్చింది. అయితే రికవరీలు మాత్రం ఇవాళ పాజిటివ్ కేసుల కంటే ఎక్కువగా నమోదయ్యాయి. మొత్తం 27,266 మంది కరోనా బాధితులు ఆ మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. దాంతో కేరళలో మొత్తం రికవరీల సంఖ్య 42,83,963కు పెరిగింది.
ఇక కరోనా మరణాలు కూడా కేరళలో ఏ రోజూ వందకు తగ్గడం లేదు. ఇవాళ కూడా కొత్తగా 143 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 23,439కి పెరిగింది. కరోనా మరణాలు, రికవరీలు పోను ప్రస్తుతం 1,80,842 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవాళ మొత్తం 1,21,070 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించారని, వారిలో 19,325 మందికి పాజిటివ్ వచ్చిందని కేరళ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.