తిరువనంతపురం: తీర రాష్ట్రం కేరళను కరోనా మహమ్మారి మరోమారు ఉక్కిబిక్కిరి చేస్తున్నది. గతంలో తొలి రెండు వేవ్ల సందర్భంగా కూడా కేరళపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపింది. ఆ తర్వాత మెల్లగా తేరుకుంటుండగానే మూడో వేవ్ విజృంభించింది. దాంతో అక్కడ రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ భారీ ఎత్తున నమోదవుతున్నాయి.
ఇవాళ ఆ సంఖ్య ఏకంగా 50 వేల మార్కును దాటింది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు గడిచిన 24 గంటల వ్యవధిలో కేరళలో 55,475 మంది కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే రికవరీలు మాత్రం ఇవాళ 30,226 మాత్రమే నమోదయ్యాయి. రోజువారీ పాజిటివ్ కేసులకు, రికవరీలకు మధ్య అంతరం భారీగా పెరిగిపోతుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నది.
ప్రస్తుతం కేరళలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,85,365కు పెరిగింది. ఇక రోజువారీ కరోనా మరణాలు కూడా కేరళలో క్రమంగా పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా 70 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 52,141కి చేరింది.