Crime news : వాళ్లిద్దరూ భార్యాభర్తలు. వాళ్లకు పదేళ్లు, ఐదేళ్లు వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి పక్కింట్లో తల్లి, ఓ పెళ్లికాని కొడుకు ఉన్నారు. ఇరుగుపొరుగు కలిసిమెలిసి ఉండేవారు. కానీ ముందుగా చెప్పుకున్న దంపతుల్లో భార్య ఫోన్కు వచ్చిన ఓ కిస్ ఎమోజీ రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. భార్యపై అనుమానంతో భర్త ఆమెను, ఆమె స్నేహితుడి కొడవలితో నరికి చంపాడు. కేరళ (Kerala) లోని పతనంతిట్ట (Pathanamthitta) జిల్లా కలంజూరు (Kalanjuru) గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కలంజూరు గ్రామంలో బైజు (30), వైష్ణవి (28) అనే దంపతులు తమ పదేళ్ల, ఐదేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నారు. వారి ఇంటి పక్కనే విష్ణు (30) అనే వ్యక్తి తల్లితో కలిసి ఉంటున్నాడు. రోజూ బైజుతో కలిసి విష్ణు పనికి వెళ్లేవాడు. రెండు కుటుంబాలు కలుపుగోలుగా ఉండేవి. ఈ క్రమంలో ఇటీవల వైష్ణవి ఫోన్కు విష్ణు ఫోన్ నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అందులో విష్ణు కిస్ ఎమోజీని పంపించాడు.
అది చూసిన బైజులో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇంట్లో ఉన్న కొడవలి తీసుకుని భార్యపై దాడికి ప్రయత్నించాడు. భయంతో ఆమె పక్కనే ఉన్న విష్ణు ఇంట్లోకి పారిపోయింది. అయినా విడిచిపెట్టకుండా భార్యను వెంబడించిన బైజు ఆమెను బయటికి రావాలని ఆగ్రహంతో హెచ్చరించాడు. భయంతో ఆమె బయటకు రాలేదు. దాంతో బైజూనే ఇంట్లోకి చొరబడి ఆమె కొడవలితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన విష్ణుపై కూడా కొడవలితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.
దాడి అనంతరం బైజు తన ఇంటికి వెళ్లి స్నానం చేసి బట్టలు మార్చుకున్నాడు. ఆ తర్వాత తన స్నేహితుడికి ఫోన్ చేసి హత్యల విషయం తెలిపాడు. బైజు స్నేహితుడు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. అప్పటికే స్థానికులు వైష్ణవి, విష్ణులను ఆస్పత్రికి తరలించగా వారు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.