తిరువనంతపురం : భర్త అనుమతి లేకుండానే వివాహిత తన గర్భాన్ని తొలగించుకోవచ్చని కేరళ హైకోర్టు పేర్కొంది. 21 ఏండ్ల మహిళ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. గర్భాన్ని తొలగించేందుకు వివాహితకు తన భర్త అనుమతి అవసరమని ప్రెగ్నెన్సీ యాక్ట్లో నిబంధన లేదని హైకోర్టు స్పష్టం చేసింది. గర్భధారణ, డెలివరీకి సంబంధించిన ఒత్తిడి, బాధను భరించాల్సింది మహిళేననే కారణంతో కోర్టు ఈ మేరకు అభిప్రాయపడింది.
వైద్యపరంగా తన గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతించాలని కోరుతూ కొట్టాయంకు చెందిన 21 ఏండ్ల మహిళ దాఖలు చేసిన పిటిషిన్పై కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో గర్భిణి చట్టపరంగా విడాకులు తీసుకున్న మహిళ లేదా వితంతువు కాదు. కొద్దినెలల కిందట 21 ఏండ్ల మహిళ ఓ వ్యక్తితో పారిపోయి ఆపై అతడిని వివాహం చేసుకుంది. అయితే పెండ్లయిన తర్వాత భర్త, అతడి తల్లి ఆమె పట్ల దురుసుగా వ్యవహరించారు. ఆమె గర్భం దాల్చిన అనంతరం భర్త ఆమె ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆమెకు ఎలాంటి సాయం చేయకుండా వేధించాడు.
రోజురోజుకూ భర్త, అత్త అమానుషంగా వ్యవహరిస్తుండటంతో విసిగిన మహిళ తిరిగి పుట్టింటికి చేరింది. గర్భాన్ని తొలగించుకునేందుకు క్లినిక్ను సందర్శించగా భర్తతో విడిపోయినట్టు ఎలాంటి పత్రాలు లేనందున ఆమె వినతిని వారు తిరస్కరించారు. దీంతో మహిళ కేరళ హైకోర్టును ఆశ్రయించింది. భర్త ప్రవర్తనలో మార్పు రావడంతో ఆమె వైవాహిక జీవితంలో తీవ్ర కుదుపులు ఎదురయ్యాయని, ఆమెతో జీవించేందుకు భర్త ఎలాంటి ఆసక్తి కనబరచలేదని జస్టిస్ వీజీ అరుణ్ నేతృత్వంలోని హైకోర్టు బెంచ్ అభిప్రాయపడింది. కొట్టాయంలోని మెడికల్ కాలేజ్ లేదా మరే ఇతర ప్రభుత్వ ఆస్పత్రిలో ఆమె గర్భాన్ని తొలగించుకునేందుకు పిటిషనర్ను అనుమతిస్తున్నట్టు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.