కొల్లాం(కేరళ), జనవరి 27: కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ రోడ్డెక్కి రాష్ట్ర ప్రభుత్వ చర్యను విమర్శించడం సంచలనం సృష్టించింది. దీంతో కొల్లాం జిల్లాలో శనివారం నాటకీయ పరిణామాలతో రెండు గంటల పాటు హైడ్రామా నడిచింది. వెంటనే గవర్నర్ భద్రతను జడ్ ప్లస్ కేటగిరీకి పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. కొట్టరక్కరలో ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు తిరువనంతపురం నుంచి వెళ్తున్న గవర్నర్కు వ్యతిరేకంగా రోడ్ పక్కన సీపీఐ(ఎం) అనుబంధ సంస్థ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు నల్లజెండాలతో నిల్చుని ‘సంఘీ చాన్స్లర్ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు.
దీంతో తీవ్ర అసహనానికి గురైన గవర్నర్ తన కారును ఆపమని చెప్పి ఆందోళనకారుల వద్దకు నడుచుకుంటూ వెళ్లి ‘రండి’ అంటూ గట్టిగా అరిచారు. దీనికి ప్రతిగా ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు కూడా రెచ్చిపోయి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు గవర్నర్కు, ఆందోళనకారులకు మధ్య రక్షణ వలయంగా ఏర్పడ్డారు. పోలీసులు ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించివేసినా గవర్నర్ మాత్రం అక్క డి నుంచి కదలలేదు. దగ్గర్లోని షాపు నుంచి ఒక కుర్చీ తెప్పించుకుని దానిపై కూర్చున్నారు. ఎస్ఎఫ్ఐ కార్యకర్తలపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను చూపేవరకు అక్కడే కూర్చున్నారు.
రాజ్యాంగ సంస్థలను గుప్పిట్లో ఉంచుకోవడం ద్వారా కేంద్రం ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనం చేస్తున్నదని కేరళ సీఎం విజయన్ శనివారం ఆరోపించారు. ఇది ప్రమాదకర వైఖరని అన్నారు. ఇటీవల కాలంలో కేంద్రం ఎన్నికల సంఘంతో సహా అన్ని రాజ్యాంగ సంస్థలను తన చేతిలో ఉంచుకుని ఆడిస్తున్నదని ఆయన విమర్శించారు. ఇవన్నీ ప్రాథమికంగా మన ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనం చేస్తాయని అన్నారు.