న్యూఢిల్లీ/కొట్టాయం, డిసెంబర్ 13: తనపై దాడికి కేరళ సీఎం పినరయి విజయన్ కుట్ర చేశారని సంచలన ఆరోపణలు చేసిన కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ బుధవారం తాజాగా ముఖ్యమంత్రికి, ఆయన మంత్రులకు సిగ్గులేదని వ్యాఖ్యానించారు. దీనికి సీఎం విజయన్ కూడా దీటుగా బదులిచ్చారు. గవర్నర్ ఆరిఫ్ ఖాన్ పచ్చి అవకాశవాది అని ప్రజలు ముద్రవేశారన్నారు.
రాజ్యాంగం నిర్దేశించిన విధులను మాత్రమే గవర్నర్ నిర్వహించగలరని, గౌరవమైన రాజ్యాంగ పదవిని దిగజార్చవద్దని హితవు పలికారు. ఆరిఫ్ ఖాన్ గత రాజకీయ చరిత్రను పరిశీలిస్తే ఆయనను అవకాశవాదిగా ప్రజలు పేర్కొనేవారని, అలాంటి అవకాశవాద రాజకీయాలు ఇక్కడ చేయడానికి ప్రయత్నించవద్దంటూ విజయన్ హెచ్చరించారు.