తిరువనంతపురం: కేరళ (Kerala) అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులు ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్కు వ్యతిరేకంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. శాసనసభ ఆమోదించి పంపిన బిల్లులను సకాలంలో క్లియర్ చేసేలా గవర్నర్ ఆరిఫ్ను ఆదేశించాలని కోరింది. సీఎం పినరయి విజయన్ ప్రభుత్వం ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానంలో గురువారం పిటిషన్ దాఖలు చేసింది.
కాగా, అసెంబ్లీ ఆమోదించి పంపిన ఎనిమిది బిల్లుల్లో మూడు బిల్లులు రెండేళ్లకు పైగా, మరో మూడు బిల్లులు ఏడాదికిపైగా గరవ్నర్ వద్ద పెండింగ్లో ఉన్నాయని కేరళ ప్రభుత్వం పేర్కొంది. ప్రజా ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా శాసన సభలో ఆమోదించి పంపిన ఈ బిల్లులను గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ సకాలంలో క్లియర్ చేయలేదని విమర్శించింది. తద్వారా గవర్నర్ తన రాజ్యాంగ అధికారాలు, విధులను అమలు చేయడంలో విఫలమయ్యారని ఆ పిటిషన్లో ఆరోపించింది.
మరోవైపు బిల్లులపై గవర్నర్ నిష్క్రియాత్మక చర్య ఏకపక్షం, చట్టవిరుద్ధం, రాజ్యాంగ బాధ్యత నుంచి తప్పుకోవడంతో సమానమని కేరళ ప్రభుత్వం వాదించింది. ఈ నేపథ్యంలో పెండింగ్లో ఉన్న ఎనిమిది బిల్లులను గవర్నర్ ఆమోదించేలా ఉత్తర్వులు జారీ చేయాలని సుప్రీంకోర్టును అభ్యర్థించింది. అయితే గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ను యూనివర్సిటీల ఛాన్సలర్ నుంచి ప్రభుత్వం తొలగించిన బిల్లు కూడా ఈ పెండింగ్ జాబితాలో ఉంది.