కన్పూరు, అక్టోబర్ 8: కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారం చేపడితే దేశానికి తీవ్ర ముప్పేనని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ హెచ్చరించారు. ఆదివారం ఆయన ఉత్తర కేరళలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ బీజేపీ కనుక తిరిగి అధికారంలోకి వస్తే పెను ప్రమాదం ఏర్పడుతుందని, తర్వాత ప్రజలు పశ్చాత్తాప పడినా ప్రయోజనం ఉండదని అన్నారు. ఈ సందర్భంగా బీజీపీ పాలనను, ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ గురించి ప్రస్తావిస్తూ అవి దేశ వైవిధ్యాన్ని నాశనం చేయాలని చూస్తున్నాయని, మత ప్రాతిపాదికన దేశాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. కులం, మతం, జాతి, రంగు, భాష, ప్రాంతం, ఆచారం వంటి వాటితో సంబంధం లేకుండా చట్టం ప్రకారం అందరూ సమానమేనని, కానీ బీజేపీ పాలనలో ఆ భావనే మారిపోతున్నదని ఆయన విమర్శించారు.