తిరువనంతపురం, ఆగస్టు 15: భారత రాజ్యాంగానికి సమాఖ్య స్ఫూర్తి పునాది వంటిదని, దేశ ఉనికికి ఆధారమని కేరళ సీఎం విజయన్ పేర్కొన్నారు. ప్రత్యేకంగా ఆర్థిక పరమైన అంశాల్లో నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు చేసే విషయంలో దీన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉన్నదని స్పష్టంచేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఉద్దేశించి విజయన్ సోమవారం మాట్లాడుతూ రాష్ర్టాల అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలని, తద్వారానే ప్రజలు తగిన లబ్ధి పొందుతారని పేర్కొన్నారు. రుణపరిమితి తగ్గిస్తూ కేంద్రం రూపొందించిన ఆర్థిక విధానాల కారణంగా దక్షిణాది రాష్ర్టాలు ఆర్థిక అవరోధాలు ఎదుర్కొంటున్నాయని కేరళ ప్రభుత్వం ఇప్పటికే పేర్కొన్న నేపథ్యంలో తాజాగా విజయన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.