తిరువనంతపురం : మహ్మద్ ప్రవక్తపై బీజేపీ ప్రతినిధి నుపుర్ శర్మ వ్యాఖ్యలను కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్రంగా ఖండించారు. ప్రపంచం ముందు భారత ప్రతిష్టను సంఘ్ పరివార్ మంటగలుపుతోందని దుయ్యబట్టారు. లౌకిక ప్రజాస్వామిక వ్యవస్ధగా ప్రశంసలు అందుకున్న భారత్ను సంఘ్ పరివార్ తన చర్యలతో ప్రపంచం ముందు సిగ్గుతో తలదించుకునేలా చేసిందని మండిపడ్డారు. హిందుత్వ మతతత్వ వాదం దేశ సామాజిక భద్రత, ఆర్ధిక సుస్ధిరతను ప్రమాదంలో పడేస్తున్నాయని, విద్వేష వాదులపై కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.
హిందుత్వ మత రాజకీయాలు ముస్లింలను అణిచివేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాషాయ పాలకుల ఆర్ధిక విధానాల వైఫల్యానికి తోడు ఈ సమస్యలు అదనంగా దేశాన్ని వెంటాడుతున్నాయని అన్నారు. పలు ముస్లిం దేశాలు లక్షలాది భారతీయులకు ఉపాధి కల్పిస్తూ మన ఆర్ధిక వ్యవస్ధకు, అభివృద్ధికి తోడ్పడుతున్నాయని ఆయా దేశాలు ఇప్పుడు బీజేపీ, సంఘ్ పరివార్ విద్వేష రాజకీయాలను వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు.
ఈ దేశాలన్నీ భారత్తో స్నేహపూర్వకంగా మెలిగే దేశాలని గుర్తు చేశారు. ఏ ఇతర మతానికి సంబంధించిన విశ్వాసాలు, సంస్కృతిని అవమానించే, నిరాకరించే హక్కు ఏ ఒక్కరికి భారత రాజ్యాంగం కల్పించలేదని స్పష్టం చేశారు. దేశ లౌకిక స్ఫూర్తికి విఘాతం కలిగించి విద్వేషం వ్యాప్తి చేసే వారిపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని కేరళ సీఎం డిమాండ్ చేశారు. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా ప్రజలంతా గళం విప్పాలని కోరారు.