తిరువనంతపురం : ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న క్రిస్మస్ ఈవెంట్లో బిషప్స్కు వ్యతిరేకంగా రాష్ట్ర మంత్రి సజి చెరియన్ చేసిన వ్యాఖ్యలను కేరళలో ప్రముఖ మలంకర ఆర్ధడాక్స్ సిరియన్ చర్చ్ (Kerala Church) విమర్శించింది. ప్రధాని మోదీ పాల్గొన్న సమావేశంలో మణిపూర్ హింస ఉదంతాన్ని లేవనెత్తనందుకు క్రైస్తవ నేతలను సజి చెరియన్ ఆక్షేపించారు.
క్రిస్మస్ ఫీస్ట్కు బీజేపీ నేతలు ఆహ్వానించడంతో కొందరు బిషప్స్ పులకరించిపోయారని వారికి కేక్, వైన్ ఆఫర్ చేయగానే మణిపూర్ అంశాన్ని మరిచిపోయారని మంత్రి విమర్శించారు. మణిపూర్ గురించి వారికి పట్టలేదని అన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిర్వహించే కార్యక్రమాలు రాజకీయాలకు ఉద్దేశించినవి కాదని, ఆహ్వానించినప్పుడు వెళ్లడం తమ బాధ్యతని చర్చ్ పేర్కొంది.
తాము చేసిన పనుల్లో ఎవరికైనా రాజకీయాలు కనిపిస్తే తామేం చేయలేమని పేర్కొంది. చర్చ్ రాజకీయాలకు అతీతంగా ఉంటుందని, ప్రజలు తమ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఓటు వేస్తారని చర్చ్ ప్రతినిధి యహనన్ మర్ డయస్కొరస్ పేర్కొన్నారు. ఇక మంత్రి వ్యాఖ్యలపై బిషప్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆయన వ్యాఖ్యలతో ప్రభుత్వానికి సంబంధం లేదని పాలక సీపీఎం పేర్కొంది. మంత్రి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో ప్రభుత్వానికి చర్చ్ సహకరించదని కేరళ క్యాథలిక్ బిషప్స్ కౌన్సిల్ చైర్మన్ కోరారు.
Read More :