న్యూఢిల్లీ: ఐఏఎస్ క్యాడర్ రూల్స్-1954లో మార్పుల కోసం కేంద్ర చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా కనిపించడంలేదు. ఎందుకంటే ఐఏఎస్ క్యాడర్లో కేంద్రం ప్రతిపాదించిన డిప్యూటేషన్ రూల్స్పై పలు రాష్ట్రాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తంచేస్తున్నాయి. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేఖల దాడులు మొదలుపెట్టారు. ఐఏఎస్ క్యాడర్ రూల్స్ మార్పు ఆలోచనను విరమించుకోవాలని తమ లేఖల్లో కోరుతున్నారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇప్పటికే ప్రధానికి లేఖలు రాశారు. ఐఏఎస్ క్యాడర్ రూల్స్ మార్పుపై తమ వ్యతిరేకతను తెలియజేశారు. తాజాగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా వారి జాబితాలో చేరిపోయారు. ఐఏఎస్ క్యాడర్ రూల్స్ మార్పు నిర్ణయాన్ని కేంద్ర విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
కేంద్రంతోపాటు, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రాజ్యంగబద్ధంగా ప్రజలచేత ఎన్నుకోబడ్డాయని, కాబట్టి రాజ్యాంగ నియమావళికి లోబడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలన కొనసాగాలని విజయన్ తన లేఖలో పేర్కొన్నారు. కేంద్రం ఇష్టారీతిన ఐఏఎస్ డిప్యూటేషన్ రూల్స్లో సవరణలు చేసి సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీయవద్దని ఆయన ప్రధానిని కోరారు.