న్యూఢిల్లీ: సీనియర్ సిటిజన్లకు రైలు ప్రయాణ ఛార్జీల రాయితీని (Travel concession పునరుద్ధరించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు. ‘దయచేసి సీనియర్ సిటిజన్లకు రైల్వే ఇచ్చే రాయితీని ఆపవద్దు. కోట్లాది మంది వృద్ధులు ఈ రాయితీతో లబ్ధి పొందుతున్నారు’ అని అందులో పేర్కొన్నారు. పెద్దల ఆశీర్వాదం లేకుండా ఏ సమాజం లేదా దేశం పురోగమించదని అన్నారు. దేశాభివృద్దికి మూలమైన వృద్ధులకు రైలు టిక్కెట్ రాయితీని రద్దు చేయడం ‘దురదృష్టకరం’ అని అభివర్ణించారు.
వృద్ధులకు రైల్వే ఇచ్చే రాయితీ వల్ల రూ.1,600 కోట్లు భారం పడుతుందని కేజ్రీవాల్ తెలిపారు. అయితే రూ.45 లక్షల కేంద్ర వార్షిక బడ్జెట్ సముద్రంలో ఈ రాయితీ ఖర్చు ఒక చిన్న నీటి బిందువని ఆయన పేర్కొన్నారు. ఈ రాయితీని ఆపడానికి ద్రవ్య పరిమితులు కారణం కాకూడదని అన్నారు. ఉచిత తీర్థ యాత్రల కోసం బడ్జెట్లో రూ.50 కోట్లను కేంద్రం కేటాయించడాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రధాని మోదీకి శనివారం రాసిన ఈ లేఖను ట్విట్టర్లో సోమవారం పోస్ట్ చేశారు.
కాగా, 58 ఏళ్ళు పైబడిన మహిళల రైలు ప్రయాణాలకు సంబంధించి అన్ని క్లాసుల్లో 50 శాతం, 60 ఏళ్లు పైబడిన పురుషులకు 40 శాతం రాయితీని రైల్వే శాఖ గతంలో ఇచ్చేది. అయితే కరోనా నేపథ్యంలో 2020 మార్చి నుంచి సీనియర్ సిటిజన్లతో పాటు అన్ని వర్గాలకు రాయితీని రైల్వే మంత్రిత్వ శాఖ రద్దు చేసింది. ఆర్థిక కారణాల సాకుతో రాయితీని పునరుద్ధరించడానికి నిరాకరించింది. అన్ని రాయితీలపై రైల్వేపై రూ.2,000 కోట్ల భారం పడుతున్నదని రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ గత ఏడాది పార్లమెంటుకు తెలిపారు. ఈ నేపథ్యంలో సీనియర్ సిటిజన్లతో సహా అన్ని వర్గాల ప్రయాణ రాయితీలను పునరుద్ధరించడం కుదరదంటూ ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఆయన సమాధానమిచ్చారు.
रेल में बुजुर्गों को मिलने वाली रियायत को कृपया बंद ना कीजिए। इस रियायत से करोड़ों बुजुर्गों को फ़ायदा हो रहा है। pic.twitter.com/fRktcHVXVd
— Arvind Kejriwal (@ArvindKejriwal) April 3, 2023