న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సోమవారం కొత్త వివాదానికి తెరలేపారు. ఢిల్లీ ఎక్సైజ్ శాఖ కేసులో వ్యక్తిగతంగా కానీ, లాయర్ ద్వారా కానీ కోర్టుకు హాజరుకాలేనన్నారు. ఢిల్లీ హైకోర్టు జస్టిస్ స్వరణ కాంత శర్మకు రాసిన లేఖలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. తన అంతరాత్మ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేజ్రీవాల్ చెప్పారు. కోపంతోనే, అమర్యాదగానే తాను ఈ నిర్ణయం తీసుకోలేదన్నారు. కానీ బాధ, వినయంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందన్నారు. న్యాయ ప్రక్రియలో సాధారణ పౌరులు ఎదుర్కొనే సమస్యలను లేవనెత్తినట్లు పేర్కొన్నారు. ఎక్సైజ్ శాఖ కేసులో జస్టిస్ స్వరణ కాంత శర్మను తప్పించాలని కోరుతూ ఇటీవల కేజ్రీవాల్ కోరారు. అయితే ఆయన చేసిన అభ్యర్థనను ఏప్రిల్ 20వ తేదీన హైకోర్టు తిరస్కరించింది.
అఖిల భారతీయ అధివక్త పరిషత్ కార్యక్రమాలకు జస్టిస్ స్వరణ కాంత హాజరువుతున్నారని, ఆ సంస్థకు అధికార ప్రభుత్వంతో లింకులు ఉన్నాయని, అందుకే ఆ ఎక్సైజ్ కేసులో ఆ జడ్జీని తప్పించాలని కోరుతున్నట్లు గతంలో కేజ్రీవాల్ పేర్కొన్నారు. న్యాయమూర్తి ఇలాంటి కార్యక్రమాలకు హాజరవుతుంటే, నాకు న్యాయం జరుగుతుందని నేను ఎలా ఆశిస్తానని ఆయన అన్నారు. ఈ కేసులో ఎటువంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఇది గాంధేయ సత్యాగ్రహం రీతిలో సాగుతుందన్నారు.