న్యూఢిల్లీ : త్వరలోనే దేశ రాజధాని ఢిల్లీలో కొవిడ్ ఆంక్షలు తొలగిపోతాయని సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సారి గణతంత్ర వేడుకలకు ముందు రోజు ఆయన జాతీయ జెండాను ఎగుర వేసి, గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. గడిచిన పది రోజుల్లో కొవిడ్ ఇన్ఫెక్షన్ రేటు 20శాతానికి తగ్గిందని, ఇవాళ 10శాతానికి చేరుతుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజీవ్రాల్ పేర్కొన్నారు. జనవరి 15 కంటే చాలా తక్కువగా ఉందని, ఆ సమయంలో ఇన్ఫెక్షన్ రేటు 30శాతంగా ఉందని తెలిపారు. ఢిల్లీలో టీకాలు వేయడం వల్లే ఇన్ఫెక్షన్ రేటు తగ్గుతుందన్నారు.
త్వరలోనే ఆంక్షలు తొలగించి, ప్రజల జీవితాన్ని సాధారణ స్థితికి తీసుకువస్తామని, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కలలు కన్నవిధంగా ప్రతిబిడ్డకు విద్యనందిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నామని కేజ్రీవాల్ అన్నారు. ఏడేళ్లలో విద్యారంగంలో విప్లవాన్ని తీసుకువచ్చామన్న ఆయన.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ మన ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయంలో బీఆర్ అంబేద్కర్, భగత్ సింగ్లో ఫొటోలు ఉంటాయని ప్రకటించారు. ఇకపై ప్రభుత్వ కార్యాలయంలో ఏ రాజకీయ నాయకుడి, ముఖ్యమంత్రి ఫొటో ఉండదని స్పష్టం చేశారు.