National Status | ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల కమిషన్ జాతీయ హోదా ఇచ్చింది. దాంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబురాలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. జాతీయ హోదా పెద్ద బాధ్యత అని, పార్టీ దేశానికి దిశానిర్దేశం చేసిందన్నారు. పార్టీని ప్రారంభించిన సమయంలో కార్యకర్తలు, డబ్బు లేదన్నారు. ఇప్పుడు ఆలోచిస్తున్న సమయంలో దేశానికి మనం ఏదైనా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడని అర్థమవుతోందని కేజ్రీవాల్ అన్నారు.
దేశ క్షేమం అక్కరలేని, ప్రగతిని కోరని వ్యతిరేక శక్తులన్నీ ఆమ్ ఆద్మీ పార్టీని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. అలాగే మనీష్ సిసోడియా అరెస్ట్పై మండిపడ్డారు. ఆయన చేసిన తప్పేంటని ప్రశ్నించారు. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్రెంచ్, స్పానిష్, జపనీస్, జర్మన్ భాషలను బోధిస్తున్నాయన్నారు. తాను పెద్ద స్కూల్లో చదివినా అలాంటి సౌకర్యం లేదన్నారు. పేద పిల్లలు కలలు కనడం నేర్పించడం మనీష్ సిసోడియా చేసిన తప్పు అన్నారు. 75 ఏళ్లుగా నిరుపేదల బిడ్డలకు మంచి చదువు లేకుండా పోయిందని, వారి కలను నేరవేర్చారన్నారు. పేదలందరికీ ఉచిత వైద్యం అందించేందుకు సత్యేందర్ జైన్ చర్యలు తీసుకున్నారని, ఇదే ఆయన చేసిన నేరమన్నారు. పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.