చండీగఢ్: హర్యానాలో కూడా పంజాబ్ లాంటి పెద్ద ‘రాజకీయ తుఫాన్’ వస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. అయితే దీని వల్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ఇది వారి మంచి కోసమేనని అన్నారు. హర్యానాలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో కురుక్షేత్రలో ఆదివారం ఆ పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేజ్రీవాల్ మాట్లాడారు. హర్యానాలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఇక్కడి పిల్లలకు ఉద్యోగాలు కల్పించదని, నిరుద్యోగులైన గుండాలు వారికి కావాలని విమర్శించారు. ‘నాకు ఒక అవకాశం ఇవ్వండి. హర్యానాలోని అన్ని పాఠశాలలను నేను మెరుగుపరుస్తాను. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలు దీనికి నిదర్శనం. పేదల పిల్లలు కూడా ఇంజనీర్లు, వైద్యులు అవుతారు’ అని అన్నారు. అలాగే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది పాటు నిరసనలు సాగించి కేంద్ర ప్రభుత్వం వాటిని వెనక్కు తీసుకునేలా పోరాడిన హర్యానా రైతులను ఆయన అభినందించారు.
కాగా, పంజాబ్ ఎన్నికల్లో ఆప్ పార్టీ విజయంతో హర్యానాకు చెందిన అరవింద్ కేజ్రీవాల్ సొంత రాష్ట్రంపై కన్నేశారు. 2024లో జరుగనున్న ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖట్టార్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని బీజేపీకి ఆయన సవాల్ విసిరారు.