న్యూఢిల్లీ : గుజరాత్లో తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులందరికీ నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తామని ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. గుజరాత్ గడ్డపై జన్మించిన వారందరికీ ఉచిత నాణ్యమైన విద్యను అందిస్తామని కచ్ జిల్లాలోని భుజ్లో టౌన్హాల్ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కేజ్రీవాల్ పలు వరాలు గుప్పించారు.
ఈ ఏడాది చివరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అధికారం అప్పగిస్తే ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులను మెరుగుపరుస్తామని, పెద్దసంఖ్యలో నూతన స్కూళ్లను ప్రారంభిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం ఏర్పాటైతే ప్రైవేట్ స్కూల్స్ వసూలు చేసిన అధిక ఫీజులను వెనక్కి ఇచ్చేలా చర్యలు చేపడతామని, ఢిల్లీ మోడల్లో ఈ తరహా చర్యలు అమలు చేస్తామని చెప్పారు.
తమ ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపడితే కాంట్రాక్టు ఉపాధ్యాయుల సర్వీసును క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ టీచర్లకు బోధనేతర పనులను కేటాయించబోమని స్పష్టం చేశారు. ఇక కేజ్రీవాల్ ఇటీవల పలుమార్లు చేపట్టిన గుజరాత్ పర్యటనల్లో ఉచిత విద్యుత్, ఉపాధి కల్పన, నిరుద్యోగ భృతి వంటి వివిధ హామీలను ప్రకటించారు.