Kejriwal and yoga | ఢిల్లీలో పనిచేస్తున్న యోగా గురువుల జీతాల కోసం ఆర్థిక మద్దతుగా నిలవాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రజలను కోరుతున్నారు. ఈ మేరకు శనివారం ఆయన యోగా ఉపాధ్యాయుల జీతాల కోసం సహకారం అందివ్వాలని ఓ వాట్సాప్ నంబర్ను విడుదల చేశారు. ‘ఢిల్లీ కి యోగశాల’ కింద చేపడుతున్న యోగా తరగతులను బీజేపీ నిలిపివేసిందని, అయితే ఢిల్లీ ప్రజలు మాత్రం ఆ తరగతులను ఆపడం లేదని కేజ్రీవాల్ పేర్కొన్నారు. యోగా టీచర్ల జీతాన్ని చెల్లించేందుకు ఢిల్లీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఒక్కో యోగా టీచర్కు రూ.15,000 జీతం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
యోగా తరగతులను మూసివేయడం వల్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నదని, యోగా టీచర్ల జీతం బాధ్యత తీసుకోవాలనుకునే వారు 72779 72779 నంబర్కు వాట్సాప్ సందేశం పంపవచ్చని కేజ్రీవాల్ సూచించారు. ఎంత మంది ఉపాధ్యాయులకు వేతనాలు అందిస్తారో తెలుపాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మీరిచ్చే నగదు లేదా చెక్ నేరుగా యోగా గురువుకు వెళ్తుందని తెలిపారు. కొంతమంది యోగా క్లాసుల మొత్తం ఖర్చును భరించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. అయితే ఇందులో ఎక్కువ మంది ప్రజలను పాల్గొనేలా చేయాలని కోరుకుంటున్నట్లు శనివారం మీడియా సమావేశంలో చెప్పారు. ఈ నెలాఖరులోగా యోగా టీచర్ల పేర్లను వెల్లడిస్తానన్నారు.
ఢిల్లీలో 17 లక్షల మందికి యోగాను అందివ్వాలన్నదే తమ పార్టీ లక్ష్యమని కేజ్రీవాల్ చెప్పారు. తమ ప్రయత్నానికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారని వెల్లడించారు. యోగా తరగతులు మూత పడకుండా చూస్తానని, వారికి ఎక్కడి నుంచైనా డబ్బు తీసుకొచ్చి జీతాలు చెల్లిస్తానన్నారు. ప్రజలు ఎంతమంది యోగా గురువులకు జీతాలు ఇవ్వదల్చుకున్నారో ఇవాళ విడుదల చేసిన వాట్సాప్ నంబర్కు తెలుపాలని కేజ్రీవాల్ సూచించారు.