న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24 : ఎల్జీ సక్సేనా నుంచి నేరుగా వచ్చే ఎలాంటి ఆదేశాలనూ పాటించరాదని, వాటిని సంబంధిత మంత్రికి గానీ, ఇన్చార్జికి గానీ పంపాలని ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం శుక్రవారం వివిధ శాఖల కార్యదర్శులను ఆదేశించింది.
ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ (టీబీఆర్)ను కచ్చితంగా అనుసరించాలని పేర్కొన్నది. ఎన్నికైన ప్రజా ప్రభుత్వాన్ని విస్మరించి ఎల్జీ ఇటీవల నేరుగా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఈ ఉత్తర్వు జారీ చేసింది. ‘ఎల్జీ నేరుగా జారీ చేసే ఆదేశాలను అమలు చేయడం టీబీఆర్లోని 57వ నిబంధనను అతిక్రమించడమే. అంతేకాకుండా అది సుప్రీంకోర్టు ఆదేశాలను, రాజ్యాంగ సూత్రాలను ధిక్కరించడమే అవుతుంది. నేరుగా ఎల్జీ నుంచి వచ్చే ఆదేశాలను ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయొద్దు.’ అని డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఆదేశాలు జారీ చేశారు.