న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఎదుట తాను వ్యక్తిగతంగా కాని న్యాయవాది ద్వారా గానీ హాజరుకాబోనని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన నేరుగా జస్టిస్ స్వర్ణకాంత శర్మకు లేఖ రాసినట్లు ఆప్ సోమవారం వెల్లడించింది. జస్టిస్ స్వర్ణకాంత నుంచి న్యాయం లభిస్తుందన్న తన ఆశ భగ్నమైందని లేఖలో కేజ్రీవాల్ పేర్కొన్నట్లు పార్టీ తెలిపింది. తాను మహాత్మా గాంధీ స్ఫూర్తితో సత్యాగ్రహ మార్గాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నానని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ఈ నిర్ణయం వ్యక్తిగతమైనదని, ఆలోచించుకున్న తర్వాత తీసుకున్నదని ఆయన తెలిపారు.
మనస్సాక్షి మాట విని ఈ నిర్ణయం తీసుకున్నానని కేజ్రీవాల్ తన లేఖలో రాశారు. ఎక్సైజ్ పాలసీ కేసు విచారణ నుంచి జస్టిస్ స్వర్ణకాంత శర్మ వైదొలగాలని కోరుతూ అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. న్యాయమూర్తి పిల్లలను కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులుగా నియమించడాన్ని తన పిటిషన్లో ఆప్ అధినేత ఉదహరిస్తూ ఇందులో ప్రయోజనాలు ముడిపడే అవకాశం ఉందని అనుమానాన్ని వ్యక్తం చేశారు.
ఈ పరిస్థితి పక్షపాతంపై సహేతుకమైన అనుమానానికి పరిస్థితి దారితీసిందని ఆయన వాదించారు. అయితే జస్టిస్ స్వర్ణకాంత శర్మ తాను ఈ కేసు విచారణ నుంచి తప్పుకోవాలన్న వాదనను తోసిపుచ్చారు. పిటిషనర్ అభిప్రాయం మాత్రమే న్యాయమూర్తి వైదొలగడానికి కారణం కాకూడదని ఆమె స్పష్టం చేశారు.