Arvind Kejriwal | ఢిల్లీ, ముంబై నగరాల్లో ఉన్న బీబీసీ ఆఫీసుల్లో ఇవాళ కూడా ఐటీశాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రంతా సోదాలు చేసిన అధికారులు.. వరుసగా రెండో రోజూ కూడా తనిఖీలు చేపడుతున్నారు. ప్రధాని మోదీపై డాక్యుమెంటరీని బీబీసీ ప్రసారం చేసిన నేపథ్యంలో ఆ సంస్థపై దాడులు చేస్తున్నట్లు ప్రతిపక్షాలు ఇప్పటికే ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ప్రజాస్వామ్యానికి మీడియా నాలుగో స్తంభం లాంటిదన్నారు. ఇదే సందర్భంలో బీజేపీ ప్రభుత్వంపై కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
‘మీడియా ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం. మీడియా స్వేచ్ఛపై దాడి చేయడమనేది ప్రజల గొంతును అణచివేయడంతో సమానం. బీజేపీకి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా సీబీఐ, ఈడీ, ఐటీ శాఖలను వారిపై ఉసిగొలుపుతుంటారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను, సంస్థలను అణిచివేసి.. యావత్ దేశాన్ని తన బానిసలుగా మార్చుకోవాలని బీజేపీ భావిస్తోందా..?’ అంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
मीडिया लोकतंत्र का चौथा स्तम्भ है, मीडिया की स्वतंत्रता पर हमला जनता की आवाज़ दबाने के बराबर है। जो भी भाजपा के ख़िलाफ़ बोलता है उसके पीछे ये लोग IT, CBI और ED को छोड़ देते हैं।
क्या भाजपा देश की लोकतांत्रिक व्यवस्था और संस्थाओं को कुचलकर पूरे देश को अपना गुलाम बनाना चाहती है?
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 15, 2023
2002 గుజరాత్ అల్లర్ల ఘటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాత్ర ఏమిటన్నదానిపై విశ్లేషిస్తూ గత నెల బీబీసీ రెండు భాగాల డాక్యుమెంటరీని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ డాక్యుమెంటరీని కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసినప్పటికీ, అనేక విశ్వవిద్యాయాల్లో ప్రదర్శించారు. ఢిల్లీలోని జేఎన్యూ, రాజస్థాన్లోని పలు విశ్వవిద్యాలయాల్లో ఈ ప్రదర్శనలను అడ్డుకోవడం పెద్ద దుమారాన్నే రేపింది. దేశంలో బీబీసీని బ్యాన్ చేయాలని ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు దాన్ని కొట్టేసింది. కాగా, బీబీసీ డాక్యుమెంటరీని కేంద్రం నిషేధించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది.