హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): మధుమేహాన్ని ప్రొటీన్లతో అరికట్టవచ్చని బెంగళూరుకు చెందిన ప్రముఖ న్యూట్రిషనిస్ట్ హరిత తెలిపారు. నిత్యం తీసుకొనే ఆహారంలో కార్బోహైడ్రేట్ల పరిమాణం తగ్గించి, టైప్-2 డయాబెటిస్ కేసులను 16 శాతానికి తగ్గించవచ్చని వెల్లడించారు. ఈ మేరకు ఆమె ఒక పరిశోధన పత్రాన్ని విడుదల చేశారు.
‘దేశవ్యాప్తంగా 18 వేల పైచిలుకు మందిపై చేసిన సర్వేలో.. కార్బొహైడ్రేట్స్ తగ్గించుకొంటే రక్తంతో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉన్నట్టు తేలింది. మధుమేహులు బ్రౌన్ రైస్, చిక్కుడు జాతి కూరగాయలు తీసుకోవాలి. నామమాత్రంగా ఓ పూట చపాతి లాంటివి తిని, షుగర్ తగ్గుతుందన్న భావనలో ఉన్నారు. కానీ, ప్రొటీన్లు, ఫైబర్ను ఎక్కువగా తీసుకోవాలి’ అని పేర్కొన్నారు.