న్యూఢిల్లీ : మణిపూర్ వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోదీ మౌనాన్ని కాంగ్రెస్ పార్టీ ఆక్షేపించింది. మణిపూర్ భగ్గుమంటుంటే ప్రధాని నోరు మెదపకపోవడంపై మండిపడింది. గత కొద్దివారాలుగా మణిపూర్లో అల్లర్లు చెలరేగుతున్నా కేంద్రం చేష్టలుడిగి చూస్తోందని దుయ్యబట్టింది. మణిపూర్లో ప్రశాంత వాతావరణం నెలకొనేలా ప్రధాని నరేంద్ర మోదీ తక్షణమే చొరవ చూపాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal) డిమాండ్ చేశారు.
మణిపూర్ అంశంలో ప్రధాని జోక్యం చేసుకుని అక్కడి పరిస్ధితిని చక్కదిద్దాలని అన్నారు. కాగా, ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మే 3 నుంచి భగ్గుమంటూనే ఉంది. కుకీ వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలతో నెలకొన్న ఉద్రిక్తత (Manipur violence) కొనసాగుతూనే ఉంది. ఇంఫాల్ తూర్పు జిల్లాల్లోని చింగరేల్లో మణిపూర్ మంత్రి ఎల్ సుసింద్రో ప్రైవేట్ గోడౌన్కు కొందరు నిప్పంటించారు. శుక్రవారం రాత్రి ఆందోళనకారులు ఈ గోడౌన్కు నిప్పంటించడంతో ఇది పూర్తిగా దగ్ధమైందని పోలీసులు తెలిపారు.
ఇదే జిల్లాలోని ఖురై ప్రాంతంలో మణిపూర్ ఆహార శాఖ మంత్రి నివాసానికి కొందరు నిప్పంఇంచే ప్రయత్నం చేశారు. సకాలంలో పోలీసులు వీరిని అడ్డగించడంతో వారి ప్రయత్నం విఫలమైంది. మంత్రి నివాసం నుంచి ఆందోళనకారులను చెద్దరగొట్టేందుకు పోలీసులు పలు మార్లు భాష్ప వాయు గోళాలను ప్రయోగించారు. ఈ ఘటనల్లో ఎవరికి ప్రాణ నష్టం వాటిల్లకపోవడంతో పోలీసులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలతో నిరాశ్రయులైన వారికి ఇండ్లను నిర్మించేందుకు అవసరమైన స్ధలాలను మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ పరిశీలించిన కొద్దిసేపటికే మంత్రి గోడౌన్, నివాసంపై దాడులు జరగడం విశేషం.
Read More :
Alert | ఈ నెల 25 నుంచి జూలై 3 వరకు 36 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే