న్యూఢిల్లీ: కాజీపేట రైల్వే స్టేషన్(Kazipet Railway Station)ను అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద అభివృద్ధి చేస్తున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. లోక్సభలో ఇవాళ ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఆయన ఈ విషయాన్ని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 70 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామన్నారు. దాంట్లో కాజీపేట రైల్వే స్టేషన్ కూడా ఉన్నట్లు చెప్పారు.
తెలంగాణకు రైల్వే నిధుల కేటాయింపు పెంచినట్లు మంత్రి చెప్పారు. ఆ రాష్ట్రానికి రికార్డు స్థాయిలో 5336 కోట్లు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. యూపీఏ పాలన సమయంలో ఉమ్మడి రాష్ట్రానికి కూడా ఆ స్థాయిలో నిధులు రాలేదన్నారు. గతంలో తెలంగాణ, ఆంధ్రకు కలిపి కేవలం 866 కోట్లు ఇచ్చినట్లు ఆయన చెప్పారు. కేవలం నిధుల కోసమే విభజన సృష్టించడం సరికాదు అని మంత్రి తెలిపారు.
కాజీపేట రైల్వే స్టేషన్ను డివిజన్గా డెవలప్ చేస్తున్నారా అని వరంగల్ ఎంపీ కడియం కావ్య ప్రశ్న వేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే రీడెవలప్మెంట్ ప్రాజెక్టును మోదీ సర్కారు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. దేశవ్యాప్తంగా 1300 స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని, చెన్నైలోని ఎగ్మోర్ రైల్వే స్టేషన్ను కూడా అమృత్ భారత్ స్కీమ్ కింద డెవలప్ చేస్తున్నట్లు చెప్పారు.