శ్రీనగర్, జూలై 5: కశ్మీరీ పండిట్ రాహుల్ భట్ దారుణ హత్య అనంతరం కశ్మీర్ లోయలో పీఎం ప్యాకేజీ, పండిట్ ఉద్యోగుల పరిస్థితులు మరింతగా దిగజారాయి. తమకు భద్రత కల్పించడంలో కేంద్రంలోని మోదీ సర్కారు, జమ్ముకశ్మీర్ యంత్రాంగం విఫలమయ్యాయని ఆరోపిస్తూ పండిట్ ఉద్యోగులు ఆందోళనలు ఉద్ధృతం చేశారు. లోయ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నలభై రోజుల నుంచి శాంతియుత నిరసనలు చేపడుతున్నారు. ఎముకలు కొరుక్కుతినే చలిలో, చంటి బిడ్డలను వెంటబెట్టుకొని వందలాది మంది మహిళా ఉద్యోగులు కూడా ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నారు.
మీడియాతో మాట్లాడుతున్నందుకు తమకు బెదిరింపులు వస్తున్నాయని మహిళా ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. మీడియాలో ముఖం కనిపించకుండా ముసుగు వేసుకున్నప్పటికీ, తమ గొంతును గుర్తించి కొందరు బెదిరింపు కాల్స్ చేస్తున్నట్టు వాపోతున్నారు. కాగా, పీఎం ప్యాకేజీ, పండిట్ ఉద్యోగుల కోసం అదనపు క్వార్టర్లు నిర్మిస్తున్నామని, భద్రతను పెంచుతున్నామని జమ్ము రిలీఫ్ కమీషనర్ అశోక్ పండితా తెలిపారు. అమర్నాథ్ యాత్ర ముగిసిన వెంటనే సమస్యకు పరిష్కారం దొరకవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, గత కొన్ని రోజులుగా యంత్రాంగం ఇలాంటి మాటలే చెబుతూ దాటవేతధోరణి ప్రదర్శిస్తున్నదని ఉద్యోగులు మండిపడుతున్నారు. తమను లోయ నుంచి వెంటనే వేరే ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.
నా భర్త అందరితో ఎంతో ప్రేమగా ఉండేవారు. లోయలో పండిట్ల భద్రత గురించి ఎన్నడూ అనుమానాలు పెట్టుకోలేదు. ఆ గుడ్డి నమ్మకమే ఆయన ప్రాణాలు తీసింది.
– మీనాక్షి భట్, రాహుల్ భట్ భార్య
ఉద్యోగమా? ప్రాణమా? అనే ప్రశ్న ప్రస్తుతం నా ముందు ఉన్నది. అయితే, ప్రాణం కంటే విలువైంది ఏముంటుంది? అందుకే ఉద్యోగాన్ని కూడా వీడేందుకు సిద్ధమవుతున్నా.
– రూబన్ సప్రూ, టీచర్
ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉద్యోగం లో చేరా. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అబద్ధమేనని ఆలస్యంగా తెలుసుకున్నా. ఉద్యోగంలో చేరాలన్న నా నిర్ణయం తప్పని ఇప్పుడు అనిపిస్తున్నది.
– రాకేశ్ పండితా, ఉద్యోగి
పీఎం ప్యాకేజీ ఓ పొలిటికల్ స్టంట్. మాకు భద్రత లేదు. ‘నువ్వు హిందూ మహిళవు. నీకు తగిన గుణపాఠం చెప్తాం’ అంటూ నా ముస్లిం సహోద్యోగులు అంటున్నారు. నేను చేసిన తప్పేంటి?
-ఓ మహిళా ఉద్యోగిని