బెంగళూరు : ఓ ఉపాధ్యాయుడి పట్ల విద్యార్థులు అసభ్యకరంగా ప్రవర్తించారు. పాఠం బోధిస్తున్న ఉపాధ్యాయుడిపై డస్ట్ బిన్తో దాడి చేశారు. ఈ ఘటన దేవనాగరి జిల్లాలోని నల్లూరు ప్రభుత్వ పాఠశాలలో డిసెంబర్ 3వ తేదీన చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి ప్రవేశించగానే.. ఫ్లోర్పై గుట్కా పాకెట్ కనిపించింది. దీంతో సదరు ఉపాధ్యాయుడు విద్యార్థులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్రమశిక్షణతో ఉండాలని మంచి మాటలు చెప్పారు. ఇవేమీ పట్టించుకోని విద్యార్థులు.. గందరగోళ వాతావరణం సృష్టించారు. పాఠం బోధిస్తున్న టీచర్పై డస్ట్బిన్తో దాడి చేశారు. కింద పడ్డ డస్ట్బిన్ను తీసుకెళ్లి టీచర్ తలపై బోర్లించారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
ఈ ఘటనపై కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నగేశ్ స్పందించారు. ఉపాధ్యాయుడిపై విద్యార్థులు దాడి చేసిన చర్యను తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని విద్యాశాఖను, పోలీసులను ఆదేశించారు. టీచర్ పై దాడి చేసిన విద్యార్థులపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అయితే మంచి మనసున్న ఉపాధ్యాయుడు మాత్రం విద్యార్థులపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. కేసు నమోదైతే విద్యార్థుల భవిష్యత్కు నష్టం కలిగే అవకాశం ఉందని ఆ టీచర్ అభిప్రాయపడ్డాడు.