న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో వేగంగా వ్యాపిస్తున్నది. మూడు వారాల్లో నిర్ధారించిన కేసుల సంఖ్య మూడు వేలు దాటి 3,007కు చేరింది. ఒక్క కర్ణాటకలోనే గురువారం కొత్తగా 107 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 333కి చేరుకుందని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ కే సుధాకర్ తెలిపారు. మరోవైపు 876 కేసులతో మహారాష్ట్ర టాప్లో ఉన్నది. 465 కేసులతో రెండో ప్లేస్లో ఢిల్లీ, 333 కేసులతో మూడో స్థానంలో కర్ణాటక ఉన్నాయి. 291 కేసులతో నాలుగో స్థానంలో రాజస్థాన్, 284 కేసులతో ఐదో స్థానంలో కేరళ, 204 కేసులతో ఆరో స్థానంలో గుజరాత్ ఉన్నాయి. ఇప్పటి వరకు 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపించింది. 9 రాష్ట్రాల్లో వందకుపైగా కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. కాగా, ఒమిక్రాన్ వేరియంట్ వల్ల స్వల్ప లక్షణాలున్నప్పటికీ తేలికగా తీసుకోవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఇటీవల హెచ్చరించింది.