బెంగళూరు: క్లాస్ రూమ్లో తోటి విద్యార్థుల ముందు ఒక ముస్లిం విద్యార్థిని ‘ఉగ్రవాది’ అని ప్రొఫెసర్ పిలిచాడు. దీంతో ఆ విద్యార్థి ధీటుగా బదులిచ్చాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో విద్యార్థిని ‘టెర్రరిస్ట్’గా పిలిచిన ఆ ప్రొఫెసర్ను సస్పెండ్ చేశారు. బీజేపీ పాలిత కర్ణాటక రాష్ట్రంలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 25న ఉడిపిలోని మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో క్లాస్ జరుగుతుండగా బోధిస్తున్న ప్రొఫెసర్ ఉన్నట్టుండి ఒక ముస్లిం విద్యార్థిని ఉగ్రవాది అని పిలిచాడు. ఒక విద్యార్థి పేరు అడిగాడు. ముస్లిం పేరు చెప్పడంతో ఆ విద్యార్థిని అవహేళన చేశాడు. ‘ఓహ్, నువ్వు కసబ్ లా ఉన్నావు!’ అని అన్నాడు. 26/11 ముంబై ఉగ్ర దాడుల తర్వాత సజీవంగా పట్టుబడిన ఏకైక పాకిస్తానీ ఉగ్రవాది అజ్మల్ కసబ్ను 2012లో ఉరితీసిన సంగతి తెలిసిందే.
కాగా, ఆ విద్యార్థి దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. ‘26/11 తమాషా కాదు, ముస్లింలుగా ఉండి ఈ దేశంలో ఇలాంటి వాటిని ఎదుర్కోవడం తమాషా కాదు’ అని అన్నాడు. ‘మీరు నా మతం గురించి, అది కూడా ఇంత కించపరిచే రీతిలో జోక్ చేయడం తగదు. ఇది తమాషా కాదు సార్’ కాదు గట్టిగా చెప్పాడు.
అయితే ఒక తండ్రి లాగా తాను అంటున్నానని ఆ ప్రొఫెసర్ చెప్పాడు. దీంతో ఆ విద్యార్థి మరింత రెచ్చిపోయాడు. ‘నీ కొడుకుతో అలా మాట్లాడతారా? టెర్రరిస్ట్ అంటారా? ఇంత మంది ముందు నన్ను అలా ఎలా పిలుస్తారు? ఇది ఒక క్లాస్, నేర్పించే ప్రొఫెషనల్ మీరు. మీరు నన్ను అలా ఎలా అంటారు? నన్ను అలా పిలవద్దు’ అని ఆ విద్యార్థి సమాధానం ఇచ్చాడు. చివరకు ప్రొఫెసర్ ఆ విద్యార్థికి క్షమాపణలు చెప్పాడు.
మరోవైపు క్లాస్లోని ఒక విద్యార్థి తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ ప్రైవేట్ విద్యా సంస్థ చర్యలు చేపట్టింది. ముస్లిం విద్యార్థిని ఉగ్రవాది అన్న ప్రొఫెసర్ను సస్పెండ్ చేసింది. వారిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణకు దారి తీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. ఆ విద్యార్థికి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు వెల్లడించింది. ఒక ప్రొఫెసర్ నుంచి అలాంటి మాటను ఊహించని ఆ విద్యార్థి నిజంగానే ఆందోళన చెందాడని తెలిపింది. అయితే ఈ వీడియోను ఎవరు రికార్డు చేసి లీక్ చేశారో అన్నది తమకు తెలియదని పేర్కొంది.
A Professor in a class room in India calling a Muslim student ‘terrorist’ – This is what it has been to be a minority in India!
We hope the professor at Manipal University (@MAHE_Manipal) near Udupi in Karnataka regrets this.#Manipal #Education #Islamophobia #news #Indiannews pic.twitter.com/EZxOvYu1eG
— News ink Paper (@NewsinkPaper) November 28, 2022