Eshwarappa | బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్పపై కేసు నమోదైంది. ఈ మేరకు పోలీసులు మాజీ మంత్రికి నోటీసులు అందజేశారు. హనుమంతప్ప ఫిర్యాదు మేరకు దావణగెరె ఎక్స్టెన్షన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. బీజేపీ సీనియర్ నేత ప్రకటనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యల తర్వాత కేసు నమోదైంది. గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఈశ్వరప్ప మాట్లాడుతూ దక్షిణ భారతదేశాన్ని ప్రత్యేకంగా దేశంగా చేయాలనుకుంటున్న ఇద్దరు ద్రోహులను కాల్చిచంపేలా చట్టం తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేయాలన్నారు. కాంగ్రెస్ ఎంపీ డీకే సురేశ్, ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి దేశాన్ని ముక్కలు చేయాలని కోరుకుంటున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో తనపై నమోదైన ఎఫ్ఐఆర్పై ఈశ్వరప్ప స్పందిస్తూ ఇలాంటి ఎఫ్ఐఆర్లకు భయపడేది లేదని శివమొగ్గలో పేర్కొన్నారు. జాతీయవాదం, హిందుత్వ సిద్ధాంతాలపై తనపై వంద ఎఫ్ఐఆర్లు నమోదు చేసినా భయపడనని స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలపై కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే వ్యాఖ్యానిస్తూ ఈ వ్యాఖ్యలు బీజేపీ నాయకుడి తెలివితేటలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియజేస్తున్నాయన్నారు. అయితే, ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రభాష్యం చెబుతున్నారని మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప అన్నారు. దేశద్రోహులను కాల్చిచంపేందుకు మాత్రమే ఈశ్వరప్ప చట్టాన్ని కోరారని స్పష్టం చేశారు. ఈశ్వరప్ప ప్రకటనకు, ఆయనపై చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేదని.. ఎఫ్ఐఆర్ను ఈశ్వరప్ప ఎదుర్కోగల సమర్థుడని తెలిపారు.