Karnataka | బెంగళూరు, ఫిబ్రవరి 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకొన్నది. రాష్ట్ర పోలీసుశాఖ సిబ్బంది ఫోన్లలో ప్రస్తుతం ఉన్న బీఎస్ఎన్ఎల్ ( BSNL )సిమ్లను ప్రైవేటు టెలికం సంస్థ అయిన జియో ( Jio )కు మార్చుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు కమ్యూనికేషన్, లాజిస్టిక్స్ అండ్ మాడర్నైజేషన్ అడిషనల్ డీజీపీ సర్యులర్ జారీచేశారు. ఈ నిర్ణయం ద్వారా బీఎస్ఎన్ఎల్ కర్ణాటకలో 38,347 కనెక్షన్లను కోల్పోనున్నది.
ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థను కాదని, ప్రైవేటు కంపెనీకి కొమ్ముకాయడం ఏమిటని బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. బీఎస్ఎన్ఎల్ను అంతం చేసేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా పనిచేస్తున్నదని బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సంఘం కార్యదర్శి గుండన్న మండిపడ్డారు. బీఎస్ఎన్ఎల్ సేవలను విస్తరించేలా కేంద్రం ప్రోత్సహించడం లేదని విమర్శించారు.