MLC Election : కర్ణాటకలో గురువారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ఏడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఐదింటిని కాంగ్రెస్ దక్కించుకుంది. రెండు బీజేపీ గెలుచుకుంది. ప్రస్తుతం కర్ణాటక శాసన మండలిలో సభ్యులుగా ఉన్న వారిలో ఏడుగురి పదవీ కాలం ఈ నెల 30తో ముగుస్తుంది. పదవీ కాలం ముగియనున్న వారిలో నలుగురు కాంగ్రెస్ సభ్యులు, ఇద్దరు బీజేపీ సభ్యులుకాగా, ఒకరు జేడీఎస్ సభ్యుడు ఉన్నాడు. దీంతో ఖాళీ అయ్యే ఏడు ఎమ్మెల్సీ స్థానాల కోసం గురువారం బెంగళూరులోని విధాన సౌధలో ఎన్నికలు నిర్వహించారు.
ఉదయ 9.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు గెలుచుకుంది. ప్రతిపక్ష బీజేపీ 2 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ నుంచి బీకే హరిప్రసాద్, తిప్పన్నప్ప కాంకానూర్, పీవీ మోహన్, బీఎస్ శివన్న (మాలవల్లి), వినయ్ కార్తీక్ ప్రకాష్ గెలుపొందారు. బీజేపీ నుంచి లింగరాజ్ పాటిల్, రఘు ఆర్ గెలిచారు. జేడీఎస్ నుంచి పోటీ చేసిన గోవిందర రాజు ఓటమిపాలయ్యారు. తాజా విజయంతో కర్ణాటక శాసన మండలిలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 39కి చేరింది. బీజేపీకి 29 సీట్లు, జేడీఎస్కు 6 సీట్లు ఉన్నాయి. ఒక స్వతంత్ర అభ్యర్థి కూడా ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక అభ్యర్థి గెలుపొందాలంటే 28 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.
ఈ ఎన్నికల్లో జేడీఎస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఆ పార్టీకి అసెంబ్లీలో 18 మంది ఎమ్మెల్యేలున్నారు. అంటే, జేడీఎస్ అభ్యర్థికి 18 ఓట్లు రావాలి. కానీ, జేడీఎస్ మొదటి ప్రాధాన్యతా ఓట్లు 14 మాత్రమే వచ్చాయి. అంటే, నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారు. ఈ ఎన్నికల్లో వంద శాతం ఓటింగ్ నమోదైంది. ఈ ఓటింగ్లో కాంగ్రెస్ పార్టీకి 151 ఎమ్మెల్యేల మద్దతు లభించింది. దీనిపై కర్ణాటక సీఎం డీకే శివకుమార్ హర్షం వ్యక్తం చేశారు. తమ పార్టీకి విజయాన్ని కట్టబెట్టిన ఎమ్మెల్యేలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.