బెంగళూరు: దేశంలో కొవిడ్ జేఎన్.1 వేరియంట్ ప్రభలుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం (Karnataka) అప్రమత్తమయింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా 60 ఏండ్లు పైబడినవారు, గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు, జ్వరం, సర్ది, దగ్గు (కఫం) ఉన్నవారు తప్పనిసరిగా మాస్కు ధరించాలని (Mask Mandatory) ఆదేశాలు జారీచేసింది. కేరళలో (Kerala) కరోనా వైరస్ జేఎన్.1 వేరియంట్ కేసు నమోదైన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్ గుండు రావ్ (Dinesh Gundu Rao) ప్రకటించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని, తగిన ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే దవాఖానలు, హెల్త్ సెంటర్లకు సూచించామని చెప్పారు.
కేరళ సరిహద్దు జిల్లాలైన కొడగు, మంగళూరు, చామరాజనగర్ ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు వెల్లడించారు. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారికి పరీక్షలు తప్పనిసరి చేశామన్నారు. సరిహద్దుల్లో మరిన్ని పరీక్షలు చేయాల్సి ఉందన్నది తెలిపారు. అయితే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉన్నదని చెప్పారు.
కాగా, దేశంలో కొత్త వేరియంట్ వైరస్ జేఎన్.1 తొలి కేసు నిర్ధారణ కావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లాల వారీగా ఇన్ఫ్లుఎంజా వంటి అనారోగ్యాలు, శ్వాసకోస సంబంధ వ్యాధుల నమోదును పర్యవేక్షించడంతోపాటు వాటి గురించి రిపోర్ట్ ఇవ్వాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. కరోనా పరిస్థితిపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఆర్టీ-పీసీఆర్ పరీక్షలను పెంచాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. కరోనా పాజిటివ్ కేసుల నమూనాలను జీనోమ్ సీక్వెన్స్ కోసం జాతీయ ల్యాబ్లకు పంపాలని తెలిపింది. తద్వారా కొత్త వేరియంట్లను సకాలంలో గుర్తించడం సాధ్యమవుతుందని కేంద్రం పేర్కొంది.
మరోవైపు రాబోయే పండుగల సీజన్ను దృష్టిలో ఉంచుకుని ప్రజారోగ్యంపై దృష్టిసారించాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. పరిశుభ్రత విధానాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, వ్యాధుల వ్యాప్తి పెరిగే ప్రమాదాన్ని నివారించేందుకు అవసరమైన ప్రజారోగ్య చర్యలు, అవగాహన కార్యక్రమాలు వంటివి చేపట్టాలని రాష్ట్రాలకు సూచించింది.