బెంగళూరు, ఫిబ్రవరి 13: అక్రమాస్తుల కేసులో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్పై లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ప్రస్తుతం ఈ కేసు సీబీఐ దర్యాప్తు చేస్తుండటంతో హైకోర్టు ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నారు. కోర్టు సూచనల మేరకు ఈ కేసులో తాము ముందుకు వెళతామని లోకాయుక్త స్పష్టం చేసింది.
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీకే శివకుమార్పై సీబీఐ విచారణకు అనుమతి ఇస్తూ గత బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత నవంబర్లో ఉపసంహరించుకుంది. ఆ కేసు చట్టప్రకారం పెట్టలేదంటూ తన చర్యను సమర్థించుకుంది. అయితే దర్యాప్తు ఉపసంహరణపై హైకోర్టును సీబీఐ ఆశ్రయించడంతో.. కోర్టు ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్టు లోకాయుక్త ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.