(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పాలిత కర్ణాటక స్కామ్లకు నిలయంగా మారింది. ముడా, వాల్మీకి కుంభకోణాలతో ఇప్పటికే అప్రతిష్ఠ మూటగట్టుకొన్న సిద్ధరామయ్య ప్రభుత్వంలో తాజాగా ఎక్సైజ్ స్కామ్ ఒకటి వెలుగుచూసింది. మద్యం అమ్మకాలకు సంబంధించిన సీఎల్-7 లైసెన్సుల జారీకి పెద్దయెత్తున లంచాలు తీసుకొన్నారని కర్ణాటక వైన్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆరోపించారు. ఒక్కో లైసెన్స్ జారీకి రూ. 30 లక్షల నుంచి రూ. 70 లక్షల వరకూ వసూలు చేశారని, అలా మొత్తంగా రూ. 6 వేల కోట్లు తిన్నారని మండిపడ్డారు. ఈ స్కామ్లో ఎక్సైజ్ మంత్రి ఆర్బీ తిమ్మాపూర్తో పాటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు చెందిన ముగ్గురు డిప్యూటీ కమిషనర్లు, తొమ్మిది మంది సూపరింటెండెంట్లు, 13 మంది డిప్యూటీ సూపరింటెండెంట్లు, 20 మంది ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు భాగమైనట్టు ఆరోపించారు.
రెండున్నరేండ్ల సిద్ధరామయ్యపాలన.. అవినీతికి కేరాఫ్గా మారిందని కర్ణాటక వైన్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు మండిపడ్డారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో రూ. 700 కోట్ల స్కామ్ జరుగుతున్నదని 2024లోనే సీఎం సిద్ధరామయ్యకు, గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్కు, లోకాయుక్తాకు ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు. అయితే, మంత్రిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధూ సర్కారు ముందుకు రాలేదని.. దీంతో స్కామ్ తీవ్రత పెరిగిపోయిందని వాపోయారు. సిద్ధరామయ్య సర్కారుపై తమకు నమ్మకంలేదన్న వైన్ మర్చంట్స్.. ఈ స్కామ్ విషయమై కాంగ్రెస్ సీనియర్లు మల్లికార్జున ఖర్గే, రాహుల్గాంధీకే నేరుగా లేఖను రాయనున్నట్టు తెలిపారు.
అయితే, ఎక్సైజ్ స్కామ్ వార్తలను తిమ్మాపూర్ కొట్టివేశారు. ఈ ఆరోపణల్లో నిజం లేదన్న ఆయన.. దీనిపై అసెంబ్లీలోనే మాట్లాడుతానన్నారు. ఈ స్కామ్పై ప్రతిపక్ష పార్టీ నేతలు మండిపడ్డారు. ప్రజాపాలనను పక్కనబెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. స్కామ్లలో మునిగిపోయిందని ధ్వజమెత్తారు. ఇదిలాఉండగా తమ కస్టమర్లకు మద్యాన్ని ఇవ్వడానికి బెంగళూరులోని ఖరీదైన ప్రాంతాల్లోని హోటల్స్, బోర్డింగ్ హౌజ్ల యజమానులు సీఎల్-7 పేరిట ప్రత్యేక లైసెన్సులను తీసుకొంటారు. ప్రాంతాన్ని బట్టి ఈ లైసెన్స్ రూ. కోటి నుంచి 2 కోట్ల వరకూ ఉంటుందని అధికారులు చెప్తున్నారు.