హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): బీజేపీయేతర రాష్ర్టాల పట్ల కేంద్రం అనుసరిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో బుధవారం నిరసనకు దిగింది. కేంద్ర బడ్జెట్లో తమ రాష్ర్టానికి పన్నుల కేటాయింపులు, గ్రాంట్ ఇన్-ఎయిడ్ విడుదలలో అన్యాయం జరిగిందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య 135 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి ధర్నాకు దిగారు. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాల పట్ల కేంద్రంలోని బీజేపీ సర్కార్ అవలంబిస్తున్న వివక్షను నిరసిస్తూ తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం కూడా నిరసన గళమెత్తింది. కానీ, కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ సర్కార్ కనీసం సంఘీభావం కూడా ప్రకటించలేదు. కర్ణాటక, తమిళనాడుకు మాదిరిగానే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు కూడా ఎలాంటి కేటాయింపులు లేకపోయినా ఇక్కడి కాంగ్రెస్ సర్కార్ మౌనంగా ఉండటంలో మతలబు ఏమిటన్నది ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది.
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ప్రధాని మోదీని కలిశాక కేంద్రంపై నోరు మెదకపోవడంలో ఆంతర్యం ఏమిటి? తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్కు, కేంద్రంలోని బీజేపీ సర్కార్కు మధ్య ఏదైనా లోపాయికారి ఒప్పందం కుదిరిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టేందుకు కర్ణాటకలోని కాంగ్రెస్ సాయం చేసిందనేది బహిరంగ రహస్యమే. కానీ, విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాల పట్ల కేంద్రం అనుసరిస్తున్న వివక్ష, సహాయ నిరాకరణపై కర్ణాటక ఢిల్లీ వీధుల్లో కేంద్రం చర్యను ఎండగట్టినా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోవడం, కనీసం సంఘీభావం ప్రకటించకపోవడంలో మతలబు ఏమిటి? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
బీజేపీయేతర రాష్ర్టాల పట్ల కేంద్రం వివక్షపై కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాలు స్పందించినప్పటికీ, తెలంగాణ ప్రభుత్వంలో ఉలుకూ పలుకూ లేకపోవడం విమర్శలకు దారితీస్తున్నది. తెలంగాణ సర్కార్ మౌనంపై సోషల్మీడియాలో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. సీఎం రేవంత్రెడ్డిపై ఓటుకు నోటు కేసు ఉండటమే.. ఈ మౌనానికి కారణమా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్-బీజేపీ మిలాఖత్ అయిందని బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు తాజాగా ఈ ఉదంతం మరింత ఊతమిస్తున్నది.
విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల పట్ల కేంద్రం వివక్ష, కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద చిల్లిగవ్వ కేటాయించకపోయినా స్పందించకపోవడానికి కారణం ఏమిటి? కర్ణాటక సర్కార్తో కలిసి గళం విప్పకపోవడానికి కారణం ఏమిటి? అని ఒక కాంగ్రెస్ సీనియర్ నేతను ప్రశ్నించగా, ‘అది ఏఐసీసీ ఇచ్చిన పిలుపు కాదు. జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టాలన్నది కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం. మేము కర్ణాటకను అనుసరించాల్సిన అవసరం లేదు’ అని చెప్పారు. అయితే, కేంద్రంలోని బీజేపీ సర్కార్ పట్ల తెలంగాణ ప్రభుత్వం మెతక వైఖరి అవలంబిస్తుందన్న భావనకు ఈ చర్య మరింత ఊతం ఇచ్చేలా ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ హైదరాబాద్లో బీఆర్ఎస్ కార్యకర్తలు పోస్టర్లు వేశారు. కేంద్రప్రభుత్వ వివక్షపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘తెలంగాణ సీఎం నుంచి బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కమాట కూడా రాలేదు.. ఎందుకీ నిశ్శబ్దం? మీరు (రేవంత్రెడ్డి) ఎందుకు భయపడుతున్నారు? రాష్ట్ర ప్రయోజనాల పట్ల ఈ దారుణమైన లొంగుబాటు ఎందుకు? కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించడం మొదులుకొని రాష్ర్టానికి జరిగిన అన్యాయంపై మౌనంగా ఉండటం వరకు మీ వైఖరి నిజంగా భయంకరంగా ఉన్నది’ అని పేర్కొన్నారు.