బెంగళూర్ : కేరళ తీర ప్రాంతంలో ఉగ్రవాదుల కార్యకలాపాలకు సంబంధించి నిఘా వర్గాల సమాచారంతో కర్నాటక సైతం అప్రమత్తమైంది. నిఘా వర్గాల సమాచారంతో కర్నాటక తీర ప్రాంతాల్లో హై అలర్ట్ జారీ చేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై బుధవారం పేర్కొన్నారు. హుబ్లి విమానాశ్రయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నిఘా వర్గాల సమాచారంతో కర్నాటకలోని కోస్తా ప్రాంతంతో పాటు సమీప అటవీ ప్రాంతాల్లో అనుమానాస్పద కార్యకలాపాలపై రాష్ట్ర అధికార యంత్రాంగం దృష్టి సారించిందని చెప్పారు.
ఆయా ప్రాంతాల్లో దేశ వ్యతిరేక కార్యకలాపాలు ఏమైనా జరుగుతున్నాయా అనే కోణంలో ఎన్ఐఏతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం నిఘా పెంచిందని ఈ విషయాలన్నింటినీ తాను బహిరంగంగా చర్చించలేనని పేర్కొన్నారు. ఉగ్ర కార్యకలాపాలు నెరుపుతున్న ఓ వ్యక్తిని ఎన్ఐఎ అరెస్ట్ చేసిందని చెప్పారు. తీర ప్రాంతాల్లో ప్రభుత్వం హై అలర్ట్ జారీ చేసిందని సీఎం బసవరాజ్ బొమ్మై వివరించారు.