బెంగళూరు, జనవరి 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కర్ణాటక రుణాల ఊబిలో కూరుకుపోతున్నది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వ్యయ క్రమశిక్షణను పాటించలేకపోతున్నది. సాధారణ పరిపాలన వ్యవహారాల నిర్వహణ కోసం రుణాలను తీసుకుంటుండటం రుణాలు పెరిగిపోవటానికి కారణమని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొన్నారు. గత పదేండ్లలో రాష్ర్ట రుణ భారం దాదాపు 5 రెట్లు అధికమైంది. 2011-12 నుంచి 2022-23వరకు రాష్ర్ట రుణ భారం మొత్తం రూ.1.06 లక్ష కోట్ల నుంచి రూ.5.18 లక్షల కోట్లకు పెరిగింది. బసవరాజ బొమ్మై ప్రభుత్వం గత మూడేండ్లలో మొత్తం రూ.2.33 లక్షల కోట్ల అప్పులు చేసింది. 2021-22లో రాష్ర్ట రెవెన్యూ రాబడి రూ.1.89 లక్షల కోట్లు. తీసుకున్న రుణాలకు ఈ వ్యవధిలో చెల్లించిన వడ్డీ రూ.29,394 కోట్లు. అంటే రెవెన్యూ రాబడిలో 15.47 శాతాన్ని కేవలం వడ్డీ కిందే చెల్లించారు.