బెంగళూరు, మే 10: ప్రభుత్వం నుంచి సివిల్ కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే 40 శాతం లంచం. దేవుళ్ల మఠాలకు కేటాయించే గ్రాంట్లను విడుదల చేయాలంటే 30 శాతం లంచం. పర్యాటక ప్రాంతాల్లో విహార కాంట్రాక్టులకూ కమీషన్. పైగా అవినీతిపై పోరాడిన అధికారులకు వేధింపులు. ట్రాన్స్ఫర్లు. బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలో సివిల్ కాంట్రాక్టర్ల నుంచి ఉన్నతస్థాయి అధికారుల వరకు బీజేపీ ఎమ్మెల్యేల అవినీతి దాహానికి బలవుతున్నారు. తాజాగా డీజీపీ స్థాయి అధికారి ఈ వేధింపులు తట్టుకోలేక ఏకంగా ఉద్యోగానికి రాజీనామా చేయాల్సివచ్చింది.
కర్ణాటకలో నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీచేస్తున్న వారిపై డీజీపీ స్థాయి అధికారి పీ రవీంద్రనాథ్ చట్టపరమైన చర్యలు తీసుకొన్నారు. ఎస్సీ ఎస్టీ చట్టంలోని ఎనిమిదో రూల్ కింద ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటుచేసేందుకు జీవో జారీచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రవికుమార్కు లేఖ రాశారు. రవీంద్రనాథ్ పోకడలు ప్రభుత్వ పెద్దలకు ఎంతమాత్రం నచ్చలేదు. ఆయన విన్నపాలను సీఎస్ పట్టించుకోలేదు. పైగా 1989 బ్యాచ్కు చెందిన అంతటి సీనియర్ అధికారిని (డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ (డీసీఆర్ఈ) డీజీపీగా పనిచేస్తున్నారు) పోలీస్ ట్రైనింగ్ వింగ్కు ఉన్నపళాన బదిలీచేశారు. దీంతో మనస్తాపం చెందిన రవీంద్రనాథ్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అక్రమార్కులపై చర్యలు తీసుకొన్నందుకు కొంతమంది తనపై కక్ష కట్టారని రవీంద్రనాథ్ ఆరోపించారు.
‘నేను ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. నేను రిక్వెస్ట్ పెట్టుకుంటేనో, ప్రజాప్రయోజనాల దృష్ట్యానో నా బదిలీ జరుగలేదు. బదిలీ పూర్తిగా కుట్రపూరితం. అందుకే రాజీనామా చేస్తున్నా’ అని రవీంద్రనాథ్ పేర్కొన్నారు. రోజురోజుకూ కర్ణాటకలో బీజేపీ సర్కారు అవినీతి బాగోతాలు రాష్ట్రంలోని విపక్షాలనే కాదు.. దేశాన్నే విస్తుపోయేలా చేస్తున్నాయి. చివరకు రూ.2500 కోట్లు ఇస్తే ముఖ్యమంత్రిని చేస్తామని కొందరు వ్యక్తులు తనను సంప్రదించారని బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ సంచలన ఆరోపణలు చేశారంటేనే బీజేపీ అధినాయకత్వం ఏ స్థాయిలో అవినీతి వ్యాపారం చేస్తున్నదో అర్థం చేసుకోవచ్చని ఆ రాష్ట్ర ప్రధాన విపక్ష నేత ఒకరు అన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వమని చెప్పుకొనే కర్ణాటకలో అభివృద్ధి సంగతేమో కానీ అవినీతి మాత్రం రెట్టింపు వేగంతో పరుగులు తీస్తున్నదని వ్యాఖ్యానిస్తున్నారు.