Covid-19 : కరోనా వైరస్ కట్టడికి లాక్డౌన్ విధించడం గతంలో అనుసరించిన విధానమని, అది ఇప్పుడు ఎలాంటి పరిష్కారం కాదని కర్నాటక ఆరోగ్యశాఖ మంత్రి కే. సుధాకర్ అన్నారు. కర్నాటకలో ముఖ్యంగా బెంగళూర్లో కొవిడ్-19 కేసులు రోజురోజుకూ పెరుగుతున్న క్రమంలో లాక్డౌన్ విధించే అవకాశాలను ఆయన తోసిపుచ్చారు. కరోనా పుట్టుకొచ్చిన తొలినాళ్లలో ఎలాంటి పరిష్కారం లేని రోజుల్లో లాక్డౌన్ ముందుకొచ్చిందని అన్నారు.
ఇప్పుడు వైరస్ సోకిన వ్యక్తికి ఎలాంటి చికిత్స అవసరమో తెలిసివచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. కఠిన లాక్డౌన్ ప్రతిపాదన ప్రభుత్వం ముందు లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలతో పాటు వారి ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం పనిచేస్తోందని భరోసా ఇచ్చారు. కొవిడ్-19 నిబంధనల అమలుకు కృతనిశ్చయంతో ఉన్నామని చెప్పారు. ప్రస్తుత పరిస్ధితుల్లో బహిరంగ ప్రదేశాలు, మాల్స్, మార్కెట్లు, పబ్లు, రెస్టారెంట్లు, బార్లలో ప్రవేశించేందుకు కొవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ యూనివర్సల్ పాస్గా పనిచేస్తుందని అన్నారు.
కొవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్ బెంగళూర్ అర్బన్, బెంగళూర్ రూరల్, మాండ్య, మైసూర్, ఉడిపి, కోలార్ జిల్లాల్లో వేగంగా వ్యాపిస్తోందని తెలిపారు. ఈ జిల్లాల్లో అధిక పాజిటివిటీ రేటు నమోదవుతోందని, వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ చేపడుతోందని చెప్పారు. ఒమిక్రాన్ తీవ్రత తక్కువగానే ఉన్నా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోని వారిపై అధిక ప్రభావం చూపుతుందని, మరణాలు కూడా సంభవిస్తాయని అన్నారు.