న్యూఢిల్లీ, జనవరి 24: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య (34) మళ్లీ పూర్తిస్థాయి సామర్థ్యాన్ని చేరుకుంది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుల మేరకు కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరాలేను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ బుధవారం నోటిఫికేషన్ జారీచేసింది.
ఈ నియామకంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరుకోనున్నది. గత నెలలో సుప్రీంకోర్జు జడ్జి ఎస్కే కౌల్ రిటైర్ అవ్వటంతో, ఆయన స్థానంలో జస్టిస్ ప్రసన్న బి.వరాలే పేరును సూచిస్తూ కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. ‘జస్టిస్ ప్రసన్న ఇప్పుడున్న హైకోర్టు జడ్జీల్లో అత్యంత సీనియర్. అంతేగాక హైకోర్టు సీజేల్లో ఎస్సీ సామాజికవర్గానికి చెందినవారు. దీంతో ఆయన పేరును పరిగణనలోకి తీసుకున్నాం’ అంటూ నెలరోజుల క్రితం కేంద్రానికి పంపిన సిఫారసుల్లో కొలీజియం పేర్కొన్నది.