బెంగళూరు: ఈ నెల 11న బెంగళూరుకు ప్రధాని మోదీ వస్తున్నారని, ఆయన పాల్గొనే కార్యక్రమాలకు విద్యార్థులను భారీగా తీసుకురావాలని కాలేజీలను కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై విమర్శలు రావడంతో ఆదేశాలను వెనక్కి తీసుకున్నది. ప్రధాని మోదీ శుక్రవారం బెంగళూరుకు రానున్నారు. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్మించిన టెర్మినల్-2ను ఆయన ప్రారంభిస్తారు. అనంతరం 108 అడుగుల ఎత్తైన నాదప్రభు కెంపెగౌడ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
ప్రధాని పర్యటన షెడ్యూల్ ఖరారు కాగానే ప్రిన్సిపాళ్లతో సమీక్ష జరిగింది. బెంగళూరు రూరల్ జిల్లాలోని అన్ని ఇంటర్మీడియెట్, ఆ స్థాయి కళాశాలల విద్యార్థులను ప్రధాని కార్యక్రమాలకు తీసుకురావాలని అందులో నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. అయితే దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రధాని పర్యటిస్తే విద్యార్థులను తరలించడమేంటని పలు రాజకీయ పార్టీలు నిలదీశాయి. దీంతో ప్రభుత్వం తన ఆదేశాలను వెనక్కి తీసుకున్నది.