న్యూఢిల్లీ, మార్చి 29: దక్షిణాదిలో రెండు జాతీయ పార్టీలకు ప్రాణ సంకటంగా మారిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న నిర్వహించనున్నారు. అదే నెల 13న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్కుమార్ బుధవారం ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. 224 అసెంబ్లీ సీట్లున్న కర్ణాటకలో ప్రస్తుతం బీజేపీకి 119, కాంగ్రెస్కు 75, జేడీఎస్కు 28 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నది. రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి.
ఈసీ తొలిసారి వయోధికులు, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటువేసే (ఓట్ ఫ్రమ్ హోం) అవకాశాన్ని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కల్పిస్తున్నది. 80 ఏండ్లు పైబడిన వృద్ధులు, కదలలేని స్థితిలో ఉన్న వికలాంగులకు ఈ అవకాశం కల్పిస్తామని సీఈసీ రాజీవ్కుమార్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు సోమవారం, శుక్రవారం కాకుండా ఈ సారి బుధవారం పోలింగ్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన గిరిజన సమూహాల్లో అర్హులైన వ్యక్తులందరికీ ఓటుహక్కు కల్పించామని తెలిపారు. ఈ ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా 58,282 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. సగటున 883 మంది ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్ ఉంటుందని వెల్లడించారు. ఇందులో 1,320 పోలింగ్ కేంద్రాలను మహిళలే నిర్వహిస్తారని పేర్కొన్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతోపాటు పలు రాష్ర్టాల్లో ఖాళీ అయిన స్థానాల్లో ఉప ఎన్నికలకు కూడా ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. పంజాబ్లోని జలంధర్ పార్లమెంటు స్థానం, ఒడిశాలోని జర్సుగూడ, ఉత్తరప్రదేశ్లోని సౌర్, ఛన్బీ, మేఘాలయలోని సోహియాంగ్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ అనర్హతతో ఖాళీ అయిన కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించే అంశంలో తొందరేమీ లేదని సీఈసీ తెలిపారు.
మైసూర్: ఇవే తనకు చివరి ఎన్నికలని కర్ణాటక కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘మా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చాలా మంది కోరుతున్నారు. అయితే నా సొంత నియోజకవర్గం నుంచి పోటీ చేసి, గెలిచి, రిటైర్ కావాలన్నది కోరిక. అందుకే వరుణ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా’ అని తెలిపారు. ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, కాబట్టి పారదర్శకంగా నిర్వహించడానికి ఈసీ చర్యలు తీసుకోవాలని కోరారు.